పోలీస్ శాఖలో విషాదం.. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

ఏపీ పోలీస్ శాఖలో విషాదం. విజయనగరంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య. ఆమె మరణమే కారణంగా ప్రాథమిక నిర్ధారణ.

పోలీస్ శాఖలో విషాదం.. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరంలోని ఐదో బెటాలియన్‌లో ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. సూర్యనారాయణ మూర్తి (34) తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేవలం నాలుగు రోజుల క్రితమే ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ బాధను తట్టుకోలేకనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సమయానికే ఆయన ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వారంలోజుల్లోపే తల్లి, కొడుకు ఇద్దరూ మరణించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. సహోద్యోగులు, బెటాలియన్ సిబ్బంది ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Next Story