BRS: ఏపీలో బీఆర్ఎస్ భారీ స్కెచ్... త్వరలో రంగంలోకి కేసీఆర్

by Disha Web Desk 16 |
BRS: ఏపీలో బీఆర్ఎస్ భారీ స్కెచ్... త్వరలో రంగంలోకి కేసీఆర్
X

దిశ, ఉత్తరాంధ్ర: తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహా పోరాటానికి శ్రీకారం చుడుతుందని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్ఠం చేశారు. సోమవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన దీక్ష 788 రోజుకు చేరింది. ఈ దీక్షలో పాల్గొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు సంఘీభావం తెలుపుతూ డాక్టర్ తోట దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తన అనుయాయుడైన అదానీకి దొడ్డి దారిన దోచిపెట్టే కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఉన్న స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించకుండా కడపలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్‌కు సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ప్లాంట్‌పై ఆధారపడి జీవించే లక్ష కుటుంబాలు రోడ్డున పడే దుర్భరపరిస్థితులు కేంద్రం కల్పించబోతోందని జోస్యం చోప్పారు.


ప్లాంట్ భూముల్ని ఆర్ఎన్ఎల్‌కు బదిలీ చేయించాలి

రాష్ట్రపతి పేరు మీదున్న విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఆర్ఎన్ఎల్‌కు బదిలీ చేయించాలని తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ నిధులివ్వకుండా గుప్పెడు మట్టి చెంబుడు నీళ్ళు తెచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ చేష్టలు గమనించిన తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తరపున అమరావతి నిర్మాణానికి ఇవ్వాలనుకున్న రూ.25 కోట్ల చెక్కును తిరిగి తీసుకెళ్లారని గుర్తుచేశారు. రూ.45 లక్షల కోట్లున్న జాతీయ బడ్జెట్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఐదు వేలకోట్ల నిధులు కేటాయించలేదా అని ప్రశ్నించారు.


స్టీల్ ప్లాంట్ ఆస్తులు కేంద్ర ప్రభుత్వానివి, బీజేపీవి కావని తెలుగు ప్రజల ఆస్తులని మోదీ గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని, ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. బీజఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తెలంగాణా ప్రభుత్వం తరపున బిడ్ వేసేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు బీఆర్ఎస్ కేంద్రాన్ని ఢీ కొట్టేందుకు వెనుకాడబోదని హెచ్చరించారు. విశాఖనగరంలో త్వరలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌తో భారీ బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ శ్రేణులు సమాయత్తమౌతున్నాయని తోట చంద్రశేఖర్ తెలిపారు. బీజేపీ హఠావో.. దేశ్ బచావో అంటూ దేశ ప్రజల్లో చైతన్యం మొదలైందని ఘాటుగా విమర్శించారు.

ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధం

బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కలసి వచ్చే ఏ పార్టీతోనైనా కలసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తొలుత విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు తమ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తోట చంద్రశేఖర్‌కు ఆయన ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్, జై తోట అనే నినాదాలతో దీక్షా శిబిరం వద్ద హోరెత్తించారు.

Read more:

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ భారీ స్కెచ్

Next Story

Most Viewed