కోడ్ ఎఫెక్ట్.. మంత్రి దాడి శెట్టి వాహనాలు స్వాధీనం

by Disha Web Desk 16 |
కోడ్ ఎఫెక్ట్.. మంత్రి దాడి శెట్టి వాహనాలు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు పటిష్టంగా చర్యలు చేపట్టారు. ప్రతి ప్రతినిధులకు సంబంధించి చిన్న పోస్టర్ కనిపించినా తీసివేస్తున్నారు. నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్టిక్కర్లను తొలగిస్తున్నారు.

తాజాగా మంత్రి దాడి శెట్టి రాజాకు సంబంధించిన వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలపై మంత్రి దాడి శెట్టి స్టిక్కర్లు ఉన్నాయి. వీటిని తొలగించకుండా వాహనాలు నడుపుతున్నారు. మంత్రి దాడి శెట్టి కాన్వాయ్ లోని రెండు వాహనాలపై పార్టీకి చెందిన స్టిక్కర్లు, జెండాలు ఉండటంతో విశాఖలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మంత్రి దాడి శెట్టిని విశాఖ ఎయిర్ పోర్టులో దింపి తిరిగి వెళ్తుండగా ఆగనంపూడి టోల్ గేట్ సమీపంలో వాహనాలను అడ్డుకున్నారు. వైసీపీ జెండా రంగులు, సిద్ధం స్టిక్కర్లు ఉన్న రెండు ప్రభుత్వ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రి గన్ మెన్లు, కొందరు కార్యకర్తలు ఆ వాహనాల్లో తిరుగుతూ తుని వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్న వారితో సహా వాహనాలను దువ్వాడ పోలీసులకు అప్పగించారు. రాష్ట్రంలో ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలను పాటించాల్సిందేనని తెలిపారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Next Story