Visakha: గుట్టుగా కిడ్నీ ఆపరేషన్.. ఆయనే కీలకం..!

by Vemula.Srinu Prasad |

విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయటపడింది.

Visakha: గుట్టుగా కిడ్నీ ఆపరేషన్.. ఆయనే కీలకం..!
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయటపడింది. కిడ్నీ అమ్మకం వ్యవహారంలో మీడియేటర్ కీలకంగా వ్యవహరించగా, ఎముకుల డాక్టర్ కిడ్నీని తొలగించడం వెనుక మూలాల్ని పోలీసులు శోధించే పనిలో పడ్డారు. కామరాజు అనే వ్యక్తి ఒక పేషెంట్ కు కిడ్నీ అత్యవసరమని చెప్తూ డబ్బులు ఆశ చూపెట్టేవాడు. వాంబే కాలనీకి చెందిన వినయ్ కుమార్ ఒక దశలో పరిచయం అయ్యాడు. కిడ్నీ కొనుగోలు చేసే వ్యవహారాన్ని చెప్పడంతో అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో వుండడంతో తన కిడ్నీ అమ్మేందుకు ఒప్పించాడు. రూ.8.5లక్షలకు ఒప్పందం కుదరగా, అడ్వాన్స్ గా రూ.2.5 లక్షలు అందచేశాడు. ఆపరేషన్ పూర్తి అయ్యింది.. తన శరీరం నుంచి కిడ్నీ వేరు చేశారు. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వలేదు. ఇదిలా వుండగా.. అడ్వాన్సు తీసుకున్నప్పటికి ఆపరేషన్ కు ఇంకా సిద్దపడలేదని, సమయం కావాలని అడిగాడు. అయితే కామరాజు... వినయ్ మాట్లాడాలని చెప్పి.. కిడ్నాప్ చేయించి కిడ్నీని వేరు చేశారు. తన పని పూర్తి కాగానే అతడిని ఇంటివద్దకు చేర్చి చేతులు దులుపుకున్నాడు. తనకు చెల్లించాల్సిన మిగతా నగదు విషయమై ఎటువంటి సమాధానం రాకపోయేసరికి వినయ్ పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు కామరాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

డాక్టర్ పరమేశ్వరరావుదే కీలకపాత్ర

విశాఖలోని తిరుమల ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ పరమేశ్వరరావు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తెలుసుకున్నారు. డాక్టర్ పరమేశ్వరరావు ఎముకల వైద్యులు కాగా.. గతంలో నిమ్స్‌లో విధులు నిర్వర్తించారు. ఎస్ కోటకు చెందిన ఆయన తిరుమల హస్పిటల్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కిడ్నీ మార్పిడికి నిబంధనలు వున్నాయి. ఆర్ డీవో, తహసీల్దార్, స్థానిక పోలీసులకు కిడ్నీ దాత సమాచారాన్ని తెలియచేసి అనుమతి పొందాల్సి వుంది. దాత సమ్మతం, తన కిడ్నీ బంధువులకు ఇస్తున్నానని రాతపూర్వక పత్రం సమర్పించాలి. బయట వ్యక్తులకు కిడ్నీ దానం చేయాలంటే చాలా నిబంధనలున్నాయి. ప్రస్తుతం విశాఖలో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెడితే కీలకమైన విషయాలు బయటపడే అవకాశముంది

Next Story