దయానిధి మారన్ వ్యాఖ్యలను కొట్టిపడేసిన కేంద్రమంత్రి

by Thanuru Gopichand |

విభజించు పాలించు అనేది నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.

దయానిధి మారన్ వ్యాఖ్యలను కొట్టిపడేసిన కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ మహిళలు (Tamil Women) విద్యలో ముందుంటారని.. ఉత్తరాది ప్రాంతాల్లో (Northern Women) ఉండే మహిళలు వంటింటికి పరిమితమై బానిసలుగా ఉంటారనే కోణంలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దయానిధి మారన్ వ్యాఖ్యలపై దిల్లీలో జరిగిన భోగి సంబరాల్లో పాల్గొన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) స్పందించారు. వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా అవి కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేశారు. దేశంలో నిజమైన అభివృద్ధి కేవలం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. "డబుల్ ఇంజిన్" సర్కార్ (Doube Engine Sarkar) ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రమాణాలను ఈ రాష్ట్రాలు పెంచుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే విమర్శల కంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పురోగతిని గమనించాలని ప్రజలను కోరారు.

​తమిళనాడు రాష్ట్రం పట్ల భారతీయ జనతా పార్టీతోపాటు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ప్రజలను తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని స్పష్టం చేశారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాలన్నింటినీ సమానంగా చూస్తూ ఎన్డీఏ ముందుకు సాగుతోందని కుండ బద్ధలుగొట్టారు. ప్రాంతీయ వివక్ష లేని అభివృద్ధికి తగిన ఫలితాన్ని రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ప్రజలే చూపిస్తారని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో అన్ని ప్రాంతాలను భాగస్వామ్యం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Next Story