నారా లోకేశ్‌తో టచ్‌లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

by Disha Web Desk 2 |
నారా లోకేశ్‌తో టచ్‌లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
X

దిశ ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో టచ్‌లో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు వివాద రహితులు. అవినీతి ఆరోపణలు కూడా లేవు. అలాంటి ఎమ్మెల్యేలు పార్టీ మారాలనుకోవటంపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రెండు సార్లు గెలిచిన ఓ ఎమ్మెల్యేను అక్కడి నుంచి మార్చాలని పార్టీలో బలమైన వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచింది. దీనికి తోడు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయం ఆ ఎమ్మెల్యే గ్రహించి ఇక్కడ ఉండి భ్రష్టు పట్టే బదులు టీడీపీకి పోవటం మేలన్న భావంతో లోకేశ్‌తో టచ్‌లోకి వెళ్లి మాట్లాడినట్టు తెలిసింది. అయితే ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నియోజక వర్గ టికెట్ ఆశించినట్టు తెలిసింది. ఆ నియోజక వర్గంలో సదరు ఎమ్మెల్యే వర్గ ఓట్లు బలంగా ఉండడమే కారణం.

రాజధాని అంశంపై తీవ్ర వ్యతిరేకత

ఇక రెండో ఎమ్మెల్యే వైసీపీ తరపున తాను ఈ సారి గెలుపు కష్టమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని అమరావతి వ్యవహారం తన నియోజక వర్గంపై పడిందని ఆయన భయపడుతున్నట్టు సమాచారం. మూడు రాజధానుల వ్యవహారం జగన్ తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఈ నియోజక వర్గంలోని ప్రజల్లో అక్కడ అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. అయితే అధికారం ఉంది కాబట్టి రాజకీయాలు నడిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే మేల్కొని టీడీపీకి వెళ్ళే ప్రయత్నాలు ప్రారంభించారు. నేరుగా లోకేశ్‌తో టీడీపీలో చేరతానని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి‌పై అక్కడి క్యాడర్‌కు వ్యతిరేకత ఉంది. అందుకే అధిష్టానం ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు. ఇది కూడా సదరు ఎమ్మెల్యేకు కలిసి వచ్చే అంశంగా మారింది. తనకు టికెట్ ఇచ్చినా, తన భార్యకు ఇచ్చినా తాము ఓకే అని చెప్పినట్టు తెలిసింది. ఆర్థిక అంగ బలాలు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు త్వరలో క్లారిటీ ఇస్తానని లోకేశ్ ఆ ఇద్దరికి చెప్పినట్టు తెలిసింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు లోకేశ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed