గుత్తి మీదుగా తిరుపతి-పండర్‌పూర్‌ రైలు రెగ్యులర్.. పలు రైళ్ల రద్దు, పాక్షిక దారి మళ్లింపు

by Ramesh Naini |

గుత్తి మీదుగా నడిచే తిరుపతి-పండర్‌పూర్‌ స్పెషల్ రైలును రెగ్యులర్ చేయడంతో పాటు, నైరుతి రైల్వేలో పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

గుత్తి మీదుగా తిరుపతి-పండర్‌పూర్‌ రైలు రెగ్యులర్.. పలు రైళ్ల రద్దు, పాక్షిక దారి మళ్లింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే ప్రయాణికులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. గుత్తి మీదుగా నడిచే తిరుపతి-పండర్‌పూర్‌ స్పెషల్ రైలును రెగ్యులర్ చేయడంతో పాటు, నైరుతి రైల్వేలో పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ప్రత్యేక వీక్లీ రైలుగా సేవలు అందించిన తిరుపతి-పండర్‌పూర్‌-తిరుపతి (07012/32) రైలును ఇకపై రెగ్యులర్ రైలుగా మార్చారు. తిరుపతి-పండర్‌పూర్‌ (17437) ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌గా నడుస్తుంది. పండర్‌పూర్‌-తిరుపతి (17438) ఈ నెల 17 నుంచి రెగ్యులర్ వీక్లీగా అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్‌, మహబూబ్‌నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, వికారాబాద్, బీదర్, లాతూర్‌ మీదుగా ప్రయాణిస్తుంది.

రైళ్ల రద్దు, పాక్షిక రద్దు వివరాలు..

నైరుతి రైల్వే పరిధిలో జరుగుతున్న నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. బెంగళూరు-బీదర్‌ (06539) ఈ నెల 3న, బీదర్‌-బెంగళూరు (06540) రైలు ఈ నెల 4వ తేదీన రద్దయ్యాయి. గుంతకల్లు మీదుగా వెళ్లే ముంబై-బెంగళూరు-ముంబై (11301/02) రైళ్లు ఈ నెల 3, 4 తేదీల్లో, భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463/64) రైళ్లు ఈ నెల 2 నుంచి 4వ తేదీల మధ్య బెంగళూరు వెళ్లకుండా యల్హంక వరకే నడుస్తాయి. బెంగళూరు-నాందేడ్‌ (16593), మైసూరు-కాకినాడ (17290) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-అశోకపురం (12785/86) రైళ్లు ఈ నెల 2 నుంచి 4వ తేదీల మధ్య (ఆయా రైళ్ల షెడ్యూల్ ప్రకారం) బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగకుండా వెళ్తాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Next Story