తిరుమల: శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం.. పాల్గొన్న భూమన

by Disha Web Desk 21 |
తిరుమల: శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం.. పాల్గొన్న భూమన
X

దిశ, డైనమిక్ బ్యూరో : లోక కళ్యాణార్థం భవిష్యత్తులో టీటీడీ మరిన్ని భక్తి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అలిపిరి సమీపంలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో గురువారం ఉదయం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీవారి పాదపద్మముల వద్ద ఈ హోమ కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. ఎంతో ఖర్చు, శ్రమ తో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. సప్త గో ప్రదక్షిణ మందిరం నందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోమ వేదిక వద్ద ప్రతిరోజు 100 మంది గృహస్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో డిసెంబర్ 31వ తేదీ వరకు హోమం టికెట్లు బుక్ అయ్యాయని తెలిపారు. భక్తులు వర్చువల్‌గా కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. దాత సహకారంతో త్వరలో దాదాపు 500 మంది గృహస్తులు కూర్చుని ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేలా వేదికను నిర్మించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

భక్తుల చెంతకు భగవంతుడు

భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు, భక్తుల చెంతకు భగవంతుణ్ణి తీసుకువెళ్లాలన్నదే తమ సంకల్పమని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే టీటీడీ శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, భజన బృందాల ఏర్పాటు, అన్నమాచార్య సంకీర్తనలు భక్త లోకానికి అందించడం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం స్థాపన లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ...భగవంతుని ఆరాధించే అనేక పద్ధతుల్లో హోమ కార్యక్రమం అత్యంత ప్రాసస్యమైందని తెలిపారు. హోమం చేయడం, గానం చేయడం ద్వారా భగవంతుని త్వరగా చేరుకోవచ్చని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి వెల్లడించారు.

శోభాయ మానంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ప్రారంభోత్సవ ఊరేగింపు

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుండి గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభోత్సవ ఊరేగింపు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి , ఈవో ఎవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. వేద విద్యార్థులు, అధ్యాపకులు, భజన మండళ్ల కళాకారులు ఊరేగింపుగా సప్తగో ప్రదక్షిణ మందిరంకు చేరుకున్నారు. ఈ హోమ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రోజా , మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు తిప్పే స్వామి, సుబ్బరాజు, దేశ పాండే , యనాదయ్య, సతీష్ కుమార్, శేఖర్ రెడ్డి , జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, మున్సిపల్ కమిషనర్ హరిత, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజి, సివిఎస్వో నరసింహ కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ భూమన అభినయ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed