వినాయకుడి ఆలయంలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్

by Dishanational2 |
వినాయకుడి ఆలయంలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, తుని : గ్రావెల్ లోడుతో అతి వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ భీభత్సం సృష్టించింది. రోడ్డు ప్రక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ని ఢీకొని అదుపుతప్పి వినాయకుడి ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆలయంలో నిద్రిస్తున్న వ్యక్తితో పాటు టిప్పర్ లారీ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందారు. ఈ ఘోర దుర్ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి గ్రావెల్ లోడుతో టిప్పర్ ఒంటిమామిడి వెళ్తుంది. తొండంగి మండలం ఏ.కొత్తపల్లి ప్రధాన రహదారి వద్ద డ్రైవర్ నిద్ర మత్తులోకి వెళ్లడంతో టిప్పర్ రోడ్డు కుడి వైపున ఉన్న వాటర్ ట్యాంక్ ని ఢీకొట్టింది. తర్వాత అదుపుతప్పి ఎడమవైపు ఉన్న వినాయకుడి ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో వినాయకుడి ఆలయంలో నిద్రిస్తున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన తూము లక్ష్మణరావు (50), ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడి గ్రామానికి చెందిన డ్రైవర్ శేఖర్ (26), క్లీనర్ నాగేంద్ర (25) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వినాయకుడి గుడి మొత్తం నేలమట్టమైంది. టిప్పర్ లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. నిత్యం టిప్పర్ లారీలు తిరిగే కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More: పింఛన్‌కోసం ఏపీకి వచ్చి ఒడిశా ప్రమాదంలో మృత్యుఒడికి..

Next Story

Most Viewed