పోలవరంలో విదేశీ బృందం మూడోరోజు పర్యటన

by Thanuru Gopichand |

వేగవంతం కానున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు.

పోలవరంలో విదేశీ బృందం మూడోరోజు పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : విదేశీ నిపుణుల బృందం (Foreign Experts Team) మూడు రోజుల పోలవరం (Polavaram) పర్యటన కీలక దశకు చేరుకుంది. మూడు రోజులపాటు సాగిన ఈ పర్యటన నేటితో ముగిసింది. మూడో రోజు పర్యటనలో భాగంగా అమెరికా, కెనడాకు చెందిన నిపుణులు సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ బి.పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో బృందం ప్రాజెక్టులోని 'గ్యాప్-1' నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్-1 వద్ద నేల స్థిరీకరణ (Soil Stabilisation) పనులను తనిఖీ చేసింది. నేల సాంద్రత, పటిష్టతను అంచనా వేసేందుకు కొన్ని చోట్ల తవ్వకాలు జరిపి స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంపాక్షన్ పనుల నాణ్యతపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవిష్యత్తులో వరద ఉధృతిని తట్టుకునేలా మరిన్ని సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా ప్రాజెక్టు భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దవచ్చని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నిపుణుల బృందం తమ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులను తొలగించి, నిర్ణీత కాలవ్యవధిలో పనులను పూర్తి చేయడానికి అవసరమైన కీలక సూచనలు ఈ నివేదికలో ఉండనున్నాయి. ఈ మేరకు విదేశీ బృందం పోలవరం ప్రాజెక్ట్ సీఈఓ, ఇతర ఉన్నతాధికారులతో రేపు భేటీ అయ్యి ప్రాజెక్ట్ పురోగతిపై తుది చర్చలు జరపనుంది.

Next Story