సర్వ సభ్య సమావేశంలో రచ్చ రచ్చ.. కలెక్టర్‌ను నిలదీసిన జడ్పీటీసీలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-11 11:19:51  IST  )

యూరియా కొరతపై కృష్ణా జిల్లా జడ్పీ సమావేశంలో రచ్చ రచ్చ సాగింది...

సర్వ సభ్య సమావేశంలో రచ్చ రచ్చ.. కలెక్టర్‌ను నిలదీసిన జడ్పీటీసీలు
X

దిశ, వెబ్ డెస్క్: కొద్ది రోజులుగా రాష్ట్రంలో యూరియా కొరత వెక్కిరిస్తోంది. అవసరానికి తగ్గ ఎరువులు లేక రైతులు పంటలు పండించలేకపోతున్నారు. ఒక్క బస్తా యూరియా అయినా దొరుకుతుందని ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపలు కాస్తున్నారు. అయితే త్వరలో రాష్ట్రానికి యూరియా రాబోతోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ యూరియా కొరత రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ డిమాండ్ కృష్ణా జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని కూడా తాకింది. యూరియా కొరతపై స్పష్టత అడుగుతూ అధికారులను జెడ్పీటీసీలు నిలదీశారు. అయితే యూరియా కొరత లేదంటూ ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి సమాధానమిచ్చారు. దీంతో అబద్ధాలు చెబుతున్నారంటూ సమావేశం వేదికను జెడ్పీటీసీలు ముట్టడించారు. యూరియా కొరత లేదన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీల ఆందోళనతో సమావేశ మందిరంలోకి పోలీసు బలగాలు వెళ్లాయి. దీంతో జడ్పీ సర్వ సభ్య సమావేశంలోకి పోలీసులు వెళ్లడంపై జెడ్పీటీసీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు ఇంతమంది పోలీస్‌లను మోహరించారని కలెక్టర్‌ను నిలదీశారు. దీంతో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

Next Story