సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్దికి అడ్డులేదు..

by Thanuru Gopichand |

ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం అన్నారు.

సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్దికి అడ్డులేదు..
X

ఇది రికార్డ్. ఇదే ఆల్ టైం రికార్డ్..

రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనేదే ఏకైక లక్ష్యం

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాం

వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు?

స్వాత్రంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్​ బ్యూరో : కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్ధికి అడ్డు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగుర వేసిన ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్యం పొందిన 8 దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ కూడా అనేక ఎత్తుపల్లాలను చూసిందన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారీ కొత్త సవాళ్లతో రాష్ట్ర ప్రయాణం సాగిందని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ‘ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి’ అనే ఎన్​డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశబ్ద విప్లవాన్ని సృష్టించారని ఆయన తెలిపా రు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్‌కు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం అన్నారు. సంక్షేమం-అభివృద్ది-సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సీఎం పేర్కొన్నారు. నేను ఈ రోజు సవినయంగా, సగర్వంగా చెబుతున్నా.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్దికి అడ్డులేదు... సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్. ఇదే ఆల్ టైం రికార్డ్ అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోందని ఆయన తెలిపారు.

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం..

ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం అన్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటివద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చాం... ‘తన బిడ్డ చదువుకోవాలని కలలుకనే పేదింటి తల్లులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ‘తల్లికి వందనం’ పథకాన్ని తీసుకువచ్చాం. రూ.10 వేల కోట్లతో పథకాన్ని అమలు చేశాం. అన్నదాత సుఖీభవ పథకం లో మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశాం. 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించాం. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఏటా రూ.2,684 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికి 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నాం. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం. ఈ నెలఖరుకు నియామకాలు పూర్తి చేస్తాం. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌’ను రద్దు చేశాం..’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు తిరిగి తీసుకువచ్చాం. 204 అన్నా క్యాంటిన్లలో 5.16 కోట్ల మందికి రూ.5 లకే కడుపునింపాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో చోటు కల్పించాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్లు కల్లు గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు, బార్‌లు కేటాయించాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి రూ.259 కోట్లు అందించాం. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా.. ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చామని తెలిపారు.

సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు..

‘అడవితల్లి బాటలో’ కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇమామ్‌లకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 చొప్పున గౌరవవేతనం ఇస్తున్నాం అన్నారు. ‘2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.12,157 కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు జరిగేందుకు సహకరించింది. ప్రకాశం జిల్లాను కరువు నుంచి బయటపడేసే వెలుగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు చేస్తున్నాం అన్నారు.

వృథాగా పోయే నీటిని వినియోగిస్తాం..

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి వృధాగాపోయే నీటినే వినియోగిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడు కుంటామంటే అభ్యంతరాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ, వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 250 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించాం. 2028 నాటికి ‘జల జీవన్ మిషన్’ కింద ప్రతి పల్లెకు, ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ అనేది మా విధానం. ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైమ్ మానిటరింగ్ విధానాలతో ప్రజా రోగ్యానికి సంజీవనిగా వైద్యశాఖను తీర్చిదిద్దాం. మానవత్వంతో స్పందించి సీఎం సహాయ నిధి నుంచి ఇప్పటివరకూ రూ.552 కోట్లు అందించాం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లుగా నగరాలు, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశాం. 100 గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండానే ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాం అని సీఎం తెలిపారు

ఏపీ బ్రాండ్​పునరుద్ధరకు కృషి

ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించటమే కూటమి ప్రభుత్వ ఆశయం. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు 9 స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు నిర్వహించాం.113 ప్రాజెక్టులకు సంబంధించి రూ.5.94 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా 5.56 లక్షల ఉద్యోగాలు వస్తాయ్యన్నారు. దేవాలయాలు సంస్కృతికి చిహ్నాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు...6 వేలకు పైగా ఆలయాల్లో నిత్యం ధూపదీప నైవేద్యాలకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నాం. అర్చకుల వేతనాల్ని రూ.15 వేలకు పెంచాం. ఆలయాల్లో అన్యమతస్తులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఉచిత ఇసుకు విధానం అమలు చేసి... భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం. ఇప్పటివరకు 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అందించాం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మద్యం పాలసీని రూపొందించాం. నాణ్యమైన, బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగేలా చూస్తున్నాం అన్నారు. నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రజాపాలనలో సాంకేతికతను విస్తృతం చేశాం. వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ ద్వారా పరిపాలనలో కొత్తదనాన్ని తీసుకువచ్చాం. 700 పౌర సేవలు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని సీఎం తెలిపారు.

Next Story