దేశమంతా దీపావళి సంబురాలు.. 200ఏళ్లుగా ఆ గ్రామం వేడుకలకు దూరం..ఎక్కడంటే!

by Disha Web Desk 21 |
దేశమంతా దీపావళి సంబురాలు.. 200ఏళ్లుగా ఆ గ్రామం వేడుకలకు దూరం..ఎక్కడంటే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దీపావళి పండుగను దేశమంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటుంది. నార్త్ ఇండియాలో అయితే చాలా పెద్ద పండుగగా జరుపుకుంటారు. దీంతో దేశ‌మంతా దీపావ‌ళి వెలుగులు జిగేల్ జిగేల్ మంటూ ఉంటాయి. దేశమంతా ఈ ఈ దీపావళి పండగను టపాసుల మోతలతో.. చిచ్చుబుడ్డిల వెలుగులతో కన్నులపండువగా జరుకుపుంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం ఈ దీపావళిని జరుపుకోరు. వాళ్లకు అసలు దీపావళి అంటే ఏంటో కూడా తెలియదని అంటున్నారు. ఏకంగా రెండు శతాబ్ధాలుగా ఆ గ్రామంలో దీపావళి జరుపుకోరు. అసలు దీపాల వరుసలు ఎక్కడా కనిపించవు. ఇంతకీ ఆగ్రామం ఏంటో తెలుసుకోవాలంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు వెళ్లాల్సిందే.

దీపావళి పండుగ జరుపుకోం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థలం మండ‌లం పున్నాన‌పాలెం గ్రామం ఉంది. పున్నాన‌పాలెం గ్రామంలో సుమారు 400 కుటుంబాలు, 1600 మంది జ‌నాభా క‌లిగి ఉన్నారు. ఈ గ్రామంలో 200ఏళ్ళుగా దీపావళి పండుగను జరుపుకోరట. ఈ ఆధునిక యుగంలో కూడా 200 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా ఇప్పటికీ ఆ గ్రామంలో దీపావళి పండగను జరుపుకోరు. ఇంతకీ దీపావళి జరుపుకోకపోవడానికి ఓ బలమైన కారణం సైతం ఉంది. రెండు శతాబ్ధాల క్రితం ఈ గ్రామంలో దీపావ‌ళి పండుగ రోజు ఇద్దరు చనిపోయారు. అదే రోజు రెండు ఎద్దులు కూడా మ‌ర‌ణించాయి. అంతే అప్పటి నుంచి ఆ గ్రామస్థులు దీపావళికి దూరంగా ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల‌త‌ర‌బ‌డి వ‌స్తున్న ఆచారాల కార‌ణాంగా ఇక్క‌డి వారు ఆ క‌ట్టుబాట్ల‌ను పాటిస్తూ దీపావ‌ళి పండుగను నిర్వహించుకోరు. ఆధునిక యుగంలో కూడా ఇదేంటి ఇంకా మూఢ నమ్మకాలను నమ్ముతారా? అని కొందరు ప్రశ్నించినప్పటికీ తమ తరతరాల నుంచి వస్తున్న ఆచార వ్యహారంలో భాగంగా జరుపుకోమని ఆ గ్రామస్థులు చెప్తున్నారు. ఇక పెద్దలు సైతం ఎవరూ దీపావళి జరుపుకోవద్దని సూచిస్తుంటారు. దీంతో నేటి యువత కూడా పెద్దల మాటకు కట్టుబడి దీపావళి పండుగను జరుపుకోవడం లేదు.

నాగుల చవితి కూడా..

అంతేకాదండో ఈ పున్నానపాలెం గ్రామంలో నాగుల చవితి పండుగను కూడా జరుపుకోరు. ఇందుకు కూడా ఒక బలమైన కారణం ఉంది. నాగుల చ‌వితినాడు పుట్ట‌లో పాలుపోసి వ‌చ్చేస‌రికి ఓ ఇంట్లో ఉయ్యాల‌లో ఉన్న పిల్లాడు పాము కాటుకి గురై మరణించాడు. అంతే నాటి నుంచి ఈ గ్రామస్థులు నాగుల చవితి పండుగను జరుపుకోరు. తమ ప్రాంతంలో కట్టుబాట్లు ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఈ నేపథ్యంలోనే తాము కూడా ఈ నాగుల చవితి కార్యక్రమాన్ని జరుపుకోవడం లేదని గ్రామస్థులు చెప్తున్నారు.



Next Story

Most Viewed