- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీసత్యసాయి జిల్లాలో ముగ్గురు పోలీసులపై ఎస్పీ వేటు
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీసత్యసాయి జిల్లాలో ముగ్గురు పోలీసులపై వేటు పడింది. వారిపై వేటు వేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా తనకల్లు ఎస్ఐ గోపీతో పాటు హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును ఎస్పీ సస్పెండ్ చేశారు. అదే విధంగా అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులుపై చర్యలు తీసుకున్నారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసుల ముందే నిండు ప్రాణం బలికావడం పట్ల ఎస్పీ సీరియస్ అయ్యారు. స్టేషన్ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆదర్శవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లాలో పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
తనకల్లులో..
జనవరి 5న ఓ వ్యక్తి తనకల్లు పోలీసు స్టేషన్ ముందే హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్ప అనే వ్యక్తిపై హరి, చెన్నప్ప అనే వ్యక్తులు దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరగడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ నేరం పోలీసుల విధి నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీ సతీష్ కుమార్ తనకల్లు ఎస్ఐ గోపీతో పాటు హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులుపై చర్యలు తీసుకున్నారు.






