రాజోలుకు వెళ్లిన నాచారం పోలీసులు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-30 06:47:10  IST  )

ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి ఓ మహిళ ప్రాణం బలిగొన్నాడు ఓ క్యాబ్ డ్రైవర్.

రాజోలుకు వెళ్లిన నాచారం పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇల్లు అద్దెకు ఇచ్చిన పాపానికి ఓ మహిళ ప్రాణం బలిగొన్నాడు ఓ క్యాబ్ డ్రైవర్. అంతేకాకుండా ఆమె మృత దేహాన్ని ఏపీలోని గోదావరిలో పడేశారు. ఈ అమానుష ఘటనపై నాచారం పోలీసు స్టేషనులో మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అది మిస్సింగ్ కేసు కాదని మర్డర్ కేసు అని పోలీసుల విచారణలో తేలింది. మల్లాపూర్ బాబానగర్ కు చెందిన సూరెడ్డి సుజాత (65)ను నివాసంలో అద్దెకు వచ్చిన యువకుడు హత్య చేయించినట్లు వెల్లడైంది. నిందితుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరవలి మండలంకు చెందిన ఎం.అంజిబాబుగా పోలీసులు గుర్తించారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన పేరవలి మండలంకు చెందిన యువరాజు (18), అమలాపురం మండలానికి చెందిన దుర్గారావు (35) ను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు చెప్పిన విషయాల పట్ల పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. బంగారం కోసం ఇంటి యజమానిని హత్య చేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్యానంతరం మృత దేహాన్ని తమ వెంట తెచ్చుకున్న కారులో తీసుకెళ్లి రాజోలు వద్ద గోదావరి నదిలో పారేసినట్లు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన నాచారం పోలీసులు రాజోలు చేరుకొని సుజాత మృత దేహాన్ని గాలిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో నాచారం సీఐ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గాలింపులో సుజాత మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

Read More..

నగరం నడిబొడ్డున మరో ఘోరం.. ఇంటి యజమానురాలి దారుణ హత్య

Next Story