కూలి పంట పండింది: పొలంలో పనిచేస్తుండగా దొరికిన వజ్రం

by Disha Web Desk 21 |
కూలి పంట పండింది: పొలంలో పనిచేస్తుండగా దొరికిన వజ్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కూలిపనికి వెళ్లిన అతగాడు ఒక్కక్షణంలో లక్షాధికారిగా మారిపోయాడు. అదేంటి ఆ కూలీకి లాటరీ తగిలిందా? లేకపోతే రోడ్డుపక్కన ఏమైనా డబ్బుకట్టలతో ఉన్న స్కూట్ కేసు దొరికిందేమోనని అనుకుంటున్నారా? అలాంటిదేమీ కాదండోయ్...ఆ కూలి ఎలా లక్షాధికారిగా మారాడో చాలా మందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ. అదేనండీ కర్నూలు జిల్లాలో పొలంపనులకు వెళ్లిన కూలికి వజ్రం దొరికింది. దీంతో పొలం పనులకు వెళ్లిన కూలీ పంట పండింది. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ వ్యక్తి పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా అతడికి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రూ.10లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశాడు. రైతులకు వజ్రాలు దొరికితే వాటిని కొందరు వ్యాపారులు ఏజెంట్లుగా మారి రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్లు సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వజ్రాల వేట ఈ ప్రాంతాల్లోనే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో రైతులు వజ్రాల వేట ప్రారంభించారు. కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాదు పక్క జిల్లాలకు చెందిన ప్రజలు సైతం ఈ ప్రాంతాలలో వజ్రాల కోసం గాలిస్తున్నారు. తుగ్గలి మండలంలోని గ్రామాలతోపాటు జొన్నగిరి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, పగిడిరాయి, మద్దికెర మండలంలో బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు ఉంటాయని నమ్మకంతో రైతులు ఈ ప్రాంతాలలో వజ్రాల కోసం వేటాడుతుంటారు. వజ్రాలు దొరికిన వెంటనే స్థానికంగా ఉండే ఏజెంట్లు వ్యాపారులకు సమాచారం చేరవేస్తారు. దీంతో వజ్రాల వ్యాపారి రంగంలోకి దిగి వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటారు. అంతేకాదు కొందరు వ్యాపారులు వజ్రాలు దొరికిన రైతులు, కూలీలను మోసం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని కోట్లు గడిస్తున్నారు.

Next Story

Most Viewed