విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది

by Thanuru Gopichand |

బేగంపేట వేదికగా వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన.

విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో భారతదేశ విమానయాన రంగం (Civil Aviation) అద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinajarapu Rammohan Naidu) అన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026ను (Wings India 2026) కేంద్రమంత్రి బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ విమానయాన రంగం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందన్నారు. దాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వింగ్స్ ఇండియా ప్రదర్శన గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. "ఇండియన్ ఏవియేషన్: పేవింగ్ ద ఫ్యూచర్ - ఫ్రమ్ డిజైన్ టు డిప్లాయ్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇంక్లూసివిటీ టు ఇన్నోవేషన్, అండ్ సేఫ్టీ టు సస్టైనబిలిటీ" అనే ఇతివృత్తంతో (Theme) జరుగుతున్న ఈ వేడుక దేశాన్ని అంతర్జాతీయ ఏవియేషన్ హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగు అని ఆయన స్పష్టం చేశారు.

నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ మెగా ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల దిగ్గజాలు, ఆవిష్కర్తలు, వివిధ దేశాల ప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఈ ప్రదర్శనలో భాగంగా అత్యాధునిక విమానాల ప్రదర్శనలు, విమాన తయారీ రంగంలో భారత్ సాధించిన ప్రగతి, భవిష్యత్తు భాగస్వామ్యాల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా విమానాల నిర్వహణ (MRO), సుస్థిర విమానయాన ఇంధనం, డ్రోన్ సాంకేతికత వంటి కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించనుంది. దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేస్తూనే, పౌర విమానయాన రంగాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని కేంద్రమంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం తన సత్తాను గ్లోబల్ మార్కెట్‌లో చాటుతోందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Next Story