నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి లోకేష్‌ అనంతపురం పర్యటన రద్దు

by Malleboina Mahesh |

నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి లోకేష్‌ అనంతపురం పర్యటన రద్దు చేసుకొని.. అక్కడ ఉన్న ఏపీకి చెందిన వారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి లోకేష్‌ అనంతపురం పర్యటన రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా భారత సమీప దేశం అయిన నేపాల్ లో ఉద్రిక్త పరిస్థితులు (Tense situation in Nepal) నెలకొన్న విషయం తెలిసిందే. అధికార ప్రభుత్వ నిర్ణయాలు, అంతులేని అవినీతిపై ఒక్కసారిగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీంతో నేపాల్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఇప్పటికే నేపాల్ మంత్రులు, ప్రధాని, అధ్యక్షుడు తమ పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికి నిరసనలు ఆగడం లేదు. దీంతో నేపాల్ లో ఉన్న భారతీయుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ మంత్రి లోకేష్‌ (Andhra Pradesh Minister Lokesh) అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు.

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీకి చెందినవారు అధికంగా ఉన్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై లోకేష్‌ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే నేపాల్‌ పరిస్థితులపై ప్రత్యేక వార్‌ రూమ్‌ (Special war room) ఏర్పాటు చేయించారు. మరికొద్ది సేపట్లో మంత్రులు, అధికారులతో లోకేష్‌ సమన్వయం చేయనున్నట్లు తెలుస్తుంది. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి స్వయంగా మంత్రి లోకేష్ (Minister Lokesh) రంగంలోకి దిగారు. ఈ మేరకు అధికారులు ఉదయం 10 గంటల లోపు ఆర్టీజీఎస్‌ సెంటర్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. కాల్‌సెంటర్‌, వాట్సాప్‌ నెంబర్‌ ఏర్పాటు చేసి.. పరిస్థితిని మంత్రి లోకేష్‌ సమీక్షించనున్నట్లు తెలుస్తుంది.

Next Story