ప్రొద్దుటూరులో ఉద్రిక్తత: టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్

by Disha Web Desk 21 |
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత: టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఓ హత్యాయత్నం కేసులో టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయం ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టారు. మీడియాతో మాట్లాడుతుండగా ప్రొద్దుటూరు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వైసీపీ నేత బెనర్జీపై దాడి కేసులో కుట్రదారుడిగా పేర్కొంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. దీంతో ఆ సమయంలో తాను అక్కడ లేకపోయినప్పటికీ తనపై కేసు నమోదు చేయడం పట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు జీపు ఎక్కాలని ఎంత ఒత్తిడి చేసినా ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లారు. తనపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రపూరితంగా కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు సైతం పాదయాత్రగా పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. దీంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే పోలీసులు త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని తరలించారు. అనంతరం అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అసలు కేసు ఏంటంటే!

ఇకపోతే గత నెల 28న ప్రొద్దుటూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈబస్సుయాత్రలో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కార్యకర్త బెనర్జీ సైతం పాల్గొన్నారు. గాంధీ రోడ్డులోని మెడినోవా సర్కిల్‌ వద్ద వైసీపీ నేత బెనర్జీపై తెలుగు యువత నాయకుడు భరత్‌ కుమార్‌ రెడ్డి కత్తితో దాడి చేశాడు. ఇరువురికి వ్యక్తిగత విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భరత్ కుమార్ రెడ్డి..బెనర్జీతో గొడవపడ్డాడు. గొడవ కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో బెనర్జీపై భరత్ కుమార్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. బెనర్జీ తల, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే బెనర్జీ కుప్పకూలిపోయాడు. అనంతరం భరత్ కుమార్ రెడ్డి కత్తిని సంఘటనా స్థలంలోనే పడేసి బుల్లెట్‌పై పరారయ్యాడు. తెలుగు యువత నాయకుడు భరత్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు పోలీసులు. దీంతో గత 17 రోజులుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి అజ్ఞాత వాసంలో ఉన్నారు. ఈ మధ్యలో పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకుని మరీ విచారించారు. అయితే తాజాగా అజ్ఞాతవాసం వీడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖండించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుట్రపూరితంగా పోలీసులపై ఒత్తిడి పెంచి కేసులు పెట్టించారని టీడీపీ నేతలు ఆరోపించారు.



Next Story

Most Viewed