విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ అండగా నిలుస్తోంది : మంత్రి లోకేష్

by Thanuru Gopichand |   (  Updated:2025-12-03 07:30:51  IST  )

దివ్యాంగులైన (Specially Abled) విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ మొదటి నుంచి అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు.

విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ అండగా నిలుస్తోంది : మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : దివ్యాంగులైన (Specially Abled) విభిన్న ప్రతిభావంతులకు టీడీపీ మొదటి నుంచి అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి తన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసంతో వారు ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శారీరక వైరుధ్యాలు కలిగినప్పటికీ.. దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులుగా నెగ్గుతున్నారని పేర్కొన్నారు. అటువంటి వారికి టీడీపీ మొదటి నుంచి బాసటగా నిలుస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో దివ్యాంగులకు మంచి రోజులు వచ్చాయన్నారు. మంచి ప్రభుత్వంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వారికి రూ.6వేల పింఛన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. అంతేకాకుండా దివ్యాంగులకు అన్ని విధాల చేయూతను అందిస్తామని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దివ్యాంగులు సవాళ్లను అధిగమించి జీవితంలో మరెన్నో విజయాలను సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.

దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు

​ఏపీలో రెండో పర్యాయం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న పింఛను దరఖాస్తులను పరిశీలించింది. అర్హులైన వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కింద కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి కొత్తగా 8,190 మందికి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ (APDASCAC) ద్వారా దివ్యాంగులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు, సాధనాలు అందజేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో ముఖ్యంగా మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు, వీల్‌చైర్లు వంటివి ఉన్నాయి. అలాగే దివ్యాంగులకు రేషన్ పంపిణీని కూడా ఇంటి వద్దకే (Home Delivery) ముందుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక చేయూత, ఉపకరణాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు.

Next Story