కాళ్లూ చేతులూ నరికేసి.. బటన్ నొక్కి డబ్బులేస్తానంటున్న జగన్

by Disha Web Desk 21 |
ANURADHA
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమలుపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళ్లూ చేతులూ నరికేసి.. బటన్ నొక్కి డబ్బులేస్తా.. ప్రశాంతంగా బ్రతికేయ్ అన్నట్లుంది నేతన్నల విషయంలో జగన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరి అని మండిపడ్డారు. సబ్సిడీలు, స్వయం ఉపాధి రుణాలు, ప్రోత్సాహకాలు రద్దు చేసి బటన్ నొక్కి జీవితాలు మార్చేస్తున్నా అనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇదే నేతన్న నేస్తం పథకం కింద.. గతేడాది 81 వేల మందిని అర్హులుగా పేర్కొని, ఇప్పుడు 80 వేల మంది మాత్రమే అర్హులు అనడం ద్వారా.. ఏడాదిలో వెయ్యి మగ్గాలు ఏమైనట్లు? మగ్గాలు తగ్గాయా లేక.. మగ్గంపై పని చేసే వారు తగ్గారో సమాధానం చెప్పాలి అని నిలదీశారు. అందరికీ అందే పథకాలనే చేనేతలకూ ఇస్తూ.. అదే మహాద్బుతం అనేలా మాట్లాడుతున్నారు.. టీడీపీ హయాంలో ఏటా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించాం. రూ.110 కోట్ల రుణాలు మాఫీ చేశాం. 90,765 కార్మికులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. కార్పొరేషన్ల ద్వారా రూ.2 లక్షల వరకు సబ్సిడీ రుణాలిచ్చాం అని పంచుమర్తి అనురాధ గుర్తు చేశారు. ‘నూలు, రంగులపై 40 శాతం సబ్సిడీ ఇచ్చాం. మరమగ్గాలు ఏర్పాటు చేసుకునే కార్మికులకు 50శాతం వరకు రాయితీలు అందించాం. 1.11లక్షల మందికి రూ.2000 చొప్పున పెన్షన్ ఇచ్చాం. త్రిఫ్ట్ అమలు చేశాం. రిబేట్ 365 రోజులకూ అమలు చేశాం. ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించాం. ఆదరణ ద్వారా 60 వేల మందికి పనిముట్లు అందించాం. 70 వేల మగ్గాలకు మోటార్లు ఏర్పాటు చేశాం. 70వేల మగ్గాలకు జకార్డ్ లిఫ్టింగ్ సదుపాయం కల్పించాం. చేనేత వస్త్రాలపై 5% పన్ను రద్దు చేశాం. రూ.300 కోట్లతో వెంకటగిరిలో సిల్క్ పరిశ్రమ ఏర్పాటు చేశాం. సొంత మగ్గం ఏర్పాటు చేసుకునే వారికి రూ.2 లక్షల రుణం ఇచ్చాం. మగ్గం ఆధునికీకరణకు ట్రిపుల్ ఆర్, మరణించిన చేనేతలకు రూ.5 లక్షల చంద్రన్న బీమా సదుపాయం కల్పించాం. మల్బరీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాం. 54 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేతలకు తోడుగా నిలిచాం’ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ చెప్పుకొచ్చారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు, సబ్సిడీలు ఎత్తేసి బటన్ నొక్కుతున్నా, మీ బతుకులు మార్చేస్తున్నా అంటూ సిగ్గులేకుండా చెప్పుకుంటున్నాడు అని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాలనలో వంద మందికిపైగా చేనేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని... జగన్ రెడ్డి ముఠా పదుల సంఖ్యలో చేనేత కార్మికుల్ని కిరాతకంగా చంపేస్తే ఏ రోజు కూడా నోరెత్తలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటికి నిన్న ధర్మవరానికి చెందిన చేనేత కారుడు శశిని జగన్ రెడ్డి రౌడీ మూక విజయవాడలో బట్టలు విప్పి కొడితే ఇంత వరకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. ఇలాంటి జగన్ రెడ్డి చేనేతల్ని ఉద్దరించేశానని చెప్పడానికి సిగ్గుపడాలి. అందరికీ ఇచ్చే పథకాలు తప్ప.. చేనేత కార్మికుల కోసం జగన్ రెడ్డి ప్రత్యేకంగా ఏం అమలు చేశారో చెప్పే ధైర్యం చేయగలడా? అని పంచుమర్తి అనురాధ నిలదీశారు.

Read more : disha newspaper

Latest Andhra Pradesh News




Next Story

Most Viewed