పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు చెప్పిన TDP ఎమ్మెల్యేలు.. విషయమిదే!

by Gantepaka Srikanth |

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కలిశారు.

పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు చెప్పిన TDP ఎమ్మెల్యేలు.. విషయమిదే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లతోపాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్పీ భేటీ అనంతరం వీరంతా పవన్ కల్యాణ్‌ను కలిశారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, ముమ్మడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు తదితరులు ఉప ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఉన్నారు.

రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 4 నియోజకవర్గాల్లో 40 రోడ్ల అభివృద్ధి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి రూ. 22.75 కోట్లు, అమలాపురం నియోజకవర్గానికి రూ.16.18 కోట్లు, కొత్తపేటకు రూ.14.93 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి రూ. 11.28 కోట్లు కేటాయించారు. 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కరకట్ట రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు సత్యానందరావు అభ్యర్ధన మేరకు సాస్కీ నిధుల నుంచే రూ. 6 కోట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంజూరు చేశారు.

పలువురు ప్రజా ప్రతినిధులు భేటీ

శాసన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను పలువురు శాసన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, మైదుకూరు శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్, గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తిలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వానపత్రిక అందజేశారు.

Next Story