వచ్చేది టీడీపీ ప్రభుత్వమే...జగన్‌ను సైతం ఓడిస్తాం: బుద్ధా వెంకన్న

by Seetharam |
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే...జగన్‌ను సైతం ఓడిస్తాం: బుద్ధా వెంకన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది అసంభవమని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పులివెందులలో సైతం వైఎస్ జగన్‌ను ఓడించి తీరుతామని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. అబద్దపు హామీలతో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారని తీరా అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేయడం.. రాష్ట్రాన్ని దోచుకోవడం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత ప్రాంతం అయిన రాయలసీమలో కూడా ప్రజలు వైఎస్ జగన్‌ను నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడమే అందుకు నిదర్శనం అని బుద్ధా వెంకన్న అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులోభాగంగా ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని దాన్ని వైఎస్ జగన్‌ కూడా అడ్డుకోలేరని బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.


రైతుల ఘోస పట్టించుకోరా?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన దోపిడీని బట్టబయలు చేస్తామని బుద్ధా వెంకన్న అన్నారు. ముఖ్యంగా తాడేపల్లి, ఇడుపులపాయ ప్యాలస్‌లలో వైఎస్ జగన్ దాచుకున్న డబ్బును బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రైతులు తమ పంట నష్టపోయామని కన్నీరుమున్నీరు అవుతుంటే పరామర్శించాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు బస్సు యాత్రలు అంటూ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో రైతుల బాధలను వినలేని మంత్రులు ఎందుకు అని నిలదీశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో మెుద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి సైతం లేఖరాసిన విషయాన్ని బుద్ధా వెంకన్న గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలో కేవలం విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మాత్రమే బాగుపడ్డారని.. ప్రజలు మాత్రం ఘోరంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Next Story

Most Viewed