వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. పిల్లలపై ప్రమాణం చేస్తా: బోడె ప్రసాద్

by Disha Web Desk 16 |
వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. పిల్లలపై ప్రమాణం చేస్తా: బోడె ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి సత్సంబంధాలు లేవని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ టికెట్ ఈసారి ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన ఆయన కొడాలి నాని, వల్లభనేని వంశీతో సంబంధాలు ఉంటే పట్టాభి, టీడీపీ కార్యాలయంపై దాడి చేయబోతున్నారని ముందుగానే తాను ఎలా చెబుతానని ప్రశ్నించారు. నాని, వంశీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ప్రమాణం చేసి మరీ చెబుతానని బోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరిని అవమానించినప్పుడు తాను వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశానని గుర్తు చేశారు. అంతేకాదు మహిళను అవమానించి సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని బోడె ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకూ తాను తెలుగుదేశం పార్టీ కోసమే పని చేశానని... ఎలాంటి స్వలాభం చూసుకోలేదని చెప్పారు. పార్టీలో పని చేయడం రాని వ్యక్తులే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బోడె ప్రసాద్ మండిపడ్డారు.


Next Story