Chandrababu: మమల్ని చంపేస్తారా?.. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం

by Disha Web Desk 16 |
Chandrababu: మమల్ని చంపేస్తారా?.. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ అని తాను ఏనాడో చెప్పానని, ఇప్పుడు అది నిజమని మరోసారి నిరూపితమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దళిత ఎమ్మెల్యే అయిన డోల బాల వీరాంజనేయ స్వామిపై దాడి చేసి.. తిరిగి ఆయనపైనా, టీడీపీపైనా విమర్శలు చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలను చంపేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రోడ్లపైకి వస్తే పోలీసులు కూడా వైసీపీ వాళ్లను కాపాడలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. శాసనసభలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపై జరిగిన దాడికి చాలా బాధపడుతున్నానన్నారు. తమఎమ్మెల్యేని కొట్టిన వారిని మరలా అసెంబ్లీలో అడుగుపెట్టనీయమని చంద్రబాబు హెచ్చరించారు.

జగన్ సైకో కాడా?

ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారుల్ని కూడా సీఎం వైఎస్ జగన్ పార్టనర్స్ ఇన్ క్రైమ్‌గా మారుస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల డ్యూటీలో ఉండే ఆర్వో, ఎస్పీలతో తప్పులు చేయించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. గెలుపు ప్రకటించిన తరువాత వైసీపీ అభ్యర్థి రవీంద్రరెడ్డి టీడీపీ వారికి కంగ్రాట్స్ చెప్పి, వెళ్లిపోతే జగన్ వెనక్కు రప్పించి.. అధికారులపై ఒత్తిడి తెచ్చి డిక్లరేషన్ ఇవ్వకుండా చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చే వరకు తగ్గేది లేదని పట్టుబట్టి సర్టిఫికెట్ తీసుకున్నామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా పాటించనీయకుండా ఆర్వోను, కలెక్టర్‌ను అడ్డుకున్న జగన్ సైకో కాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

‘నమ్ముకున్నవాళ్లందరినీ జైలు పాలు చేశాడు..

‘నమ్ముకున్నవాళ్లందరినీ జైలు పాలు చేశాడు.. చేస్తాడు కూడా. గెలిచిన వ్యక్తిని అరెస్టు చేసి తరలించడం చూసి ప్రజాస్వామ్యం ఉందా అనుకున్నా. ఎన్నికల కమిషన్ నియామకంపై సుప్రీం కోర్టు చెప్పిన కొత్త విధానం అమల్లోకి రావాలి. ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి జగన్ వారిని తన క్రైంలో భాగస్వాములు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఇసుక మాఫియాలో భాగమైన ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి, వైసీపీనేతల ఒత్తిళ్లు తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక నెలకు చెల్లించాల్సిన రూ.21 కోట్లు చెల్లించలేదని ఒత్తిడి తెచ్చారు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నారు. ఇది పార్టనర్స్ ఇన్ కరెప్షన్.’ అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.


Next Story

Most Viewed