- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఈ-చలానా కుంభకోణం: ఆర్బిట్రేషన్ ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ-చలానా సాఫ్ట్వేర్ నిర్వహణలో జరిగిన రూ. 37 కోట్ల నిధుల మళ్లింపు ఉదంతంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈ-చలానా సాఫ్ట్వేర్ నిర్వహణలో జరిగిన రూ. 37 కోట్ల నిధుల మళ్లింపు ఉదంతంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, డిజీ యాత్ర (Digi Yatra) డెవలపర్ 'డేటాఎవాల్వ్ సొల్యూషన్స్' మధ్య జరుగుతున్న ఆర్బిట్రేషన్ ప్రక్రియపై ఏప్రిల్ 2న స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేస్తూ, డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు పంపింది.
2018లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ-చలానా సాఫ్ట్వేర్ సరఫరా, నిర్వహణ కోసం డేటాఎవాల్వ్ సంస్థతో మూడేళ్ల కాలపరిమితికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం 2021 డిసెంబర్ 31తో ముగిసింది. అయితే.. ఒప్పంద గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను సేవలు కొనసాగించమని మౌఖికంగా కోరిందని, రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో పని చేశామని కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో చెల్లింపుల విషయంలో వివాదం తలెత్తడంతో కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయిని మధ్యవర్తిగా నియమించింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2021 తర్వాత ఒప్పందం అసలు పునరుద్ధరించబడలేదని, చెల్లుబాటులో ఉన్న ఒప్పందం లేనప్పుడు మధ్యవర్తిత్వానికి తావులేదని ప్రభుత్వం వాదించింది. అంతేకాకుండా.. ట్రాఫిక్ చలానాల ద్వారా వసూలైన సుమారు రూ.37 కోట్ల ప్రజాధనాన్ని కంపెనీ అక్రమంగా మళ్లించిందని, దీనిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైందని ధర్మాసనానికి వివరించింది. ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ఇటువంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పుడు వాటిని మధ్యవర్తిత్వంతో పరిష్కరించలేమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. ఆర్బిట్రేషన్ ప్రక్రియపై స్టే విధిస్తూ తదుపరి విచారణను మే 25కు వాయిదా వేసింది. ఒకవైపు నిధుల మళ్లింపు ఆరోపణలు, మరోవైపు డిజీ యాత్ర ప్లాట్ఫామ్ యాజమాన్య హక్కులపై ఢిల్లీ హైకోర్టులో నడుస్తున్న వివాదాల నేపథ్యంలో డేటాఎవాల్వ్ సంస్థకు ఈ ఆదేశాలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి.






