ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి : హోంమంత్రి అనిత

by Thanuru Gopichand |

దిత్వా తుఫాను (Ditwah Cyclone) కారణంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి అనిత (Home Minister Anitha) అధికారులను ఆదేశించారు.

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి : హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్ : దిత్వా తుఫాను (Ditwah Cyclone) కారణంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని హోంమంత్రి అనిత (Home Minister Anitha) అధికారులను ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. సమీక్షంలో మంత్రి అనిత మాట్లాడుతూ తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. తద్వారా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని, ప్రజలను అలర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించాలని ఆదేశించారు.

భారీ వర్ష సూచన.. టోల్ ఫ్రీ నెంబర్లు

ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్ష సూచన ఉందని అధికారులు వివరించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కంట్రోల్ రూంలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలన్నారు. ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూంను సంప్రదింవచ్చని పేర్కొన్నారు. అందుకోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 కు డయల్ చేయాలని సూచించారు.

సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

తుఫాను సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలను తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తుఫాను కారణంగా విరిగిన చెట్ల కొమ్మలను, నేలకొరిగిన చెట్లను తొలగించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల విషయంలోనూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. వర్షాలు భారీగా కురుస్తున్నప్పుడు ప్రజలు ఇంటికే పరిమితమయ్యే ప్రయత్నం చేయాలని కోరారు. రైతులు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని విన్నవించారు. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగ్ లకు దూరంగా ఉండాలని హోం మంత్రి తెలిపారు.

Next Story