Ap News: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే భారీ జరిమానా

by Disha Web Desk 16 |
Ap News: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే భారీ జరిమానా
X

దిశ, నెల్లూరు జిల్లా: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రతిఒక్కరూ సహకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే భారీ జరిమానాలు విధిస్తామని కమిషనర్ వికాస్ మర్మత్ హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మాగుంట లే అవుట్‌లోని వివిధ ప్రాంతాల్లో కమిషనర్ గురువారం పర్యటించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తున్న ఫ్లోర్ పాయింట్లను గుర్తించిన కమిషనర్, బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నెల్లూరు హబ్ ప్రాంతంలోని కొంతమంది షాపుల నిర్వాహకులు బహిరంగంగా చెత్తను వేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి నోటీసులు, భారీ జరిమానాలు విధించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం దర్గామిట్టలోని ప్రధాన మార్గం వెంబడి ఉన్న వైన్ షాపు, లస్సీ షాపుల నుంచి పెద్ద మొత్తంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రోడ్లపై చేరుతూ, డ్రైను కాలువలను బ్లాక్ చేస్తున్నాయని కమిషనర్ గుర్తించారు. ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలు సంయుక్తంగా డ్రైను కాలువ పూడికతీత పనులను చేపట్టి, సంబంధిత షాపుల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అనంతరం స్థానిక బోడిగాడి తోట డంపింగ్ యార్డును కమిషనర్ పరిశీలించారు. యార్డులో చెత్త నిల్వ సామర్ధ్యం, తడి పొడి చెత్త సేకరణ విధానం, చెత్త తరలింపు ప్రక్రియ మొదలగు అంశాలను అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి, ఐ.ఏ.యస్‌కు ప్రత్యక్షంగా చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, శానిటరీ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed