కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప

by Seetharam |

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మౌత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ‌ మలయప్ప
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మౌత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా... భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.ఈ వాహనసేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర‌ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో సదా భార్గవి,సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం - ఐహిక ఫ‌ల ప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. ఇకపోతే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మివ్వనున్నారు.

Next Story