శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల నదీవిహారం: నేడు కృష్ణానదిలో తెప్పోత్సవం

by Disha Web Desk 21 |
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల నదీవిహారం: నేడు కృష్ణానదిలో తెప్పోత్సవం
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం. విజయదశమి రోజైన సోమవారంతో దసరా శరన్నవరాత్రులు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరులు హంసవాహనంపై నదీ విహారం చేయనున్నారు. తెప్పోత్సవం శోభాయమానంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ తెప్పోత్సవానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నదీ విహారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అధికార యంత్రాంగం దుర్గా ఘాట్ వద్ద హంస వాహనం ట్రైల్ రన్‌ను సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. దుర్గ‌గుడి ఇంజనీరింగ్ అధికారులు, రహదారులు, భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ హంస వాహనంపై తెప్పోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నదీ విహారంలో ఉన్న స్వామి, అమ్మవార్లను చూసి తరించేందుకు భక్తులు వేలాదిగా త‌ర‌లిరానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బోటు సామర్థ్యం మేరకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. బోట్ సపోర్టింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. దుర్గా ఘాట్‌లో 800 మందికి మాత్ర‌మే అనుమతిస్తామ‌ని సీపీ కాంతిరాణా టాటా తెలిపారు.



Next Story

Most Viewed