Ap Debts: అసెంబ్లీ సాక్షిగా మాయ చేశారు..

by Disha Web Desk 16 |
Ap Debts: అసెంబ్లీ సాక్షిగా మాయ చేశారు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌లో అప్పులను ఆదాయంగా చూపించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అప్పులను ఆదాయంగా చూపించకూడదని రిజర్వుబ్యాంకు చేసిన సూచనలు కూడా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన అంకెల గారడీతో మాయ చేశారని విమర్శించారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాసన సభలో ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

మూలధనం వ్యయం పెరగపోవడంపై ఆందోళన

రాష్ట్ర బడ్జెట్ 80 శాతం రెవెన్యూ వ్యయం కాగా మూలధనం వ్యయం పెరగపోవడం ఆందోళన కలిగిస్తోందని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. మూల ధనవ్యయం లేకపోతే ఆర్ధిక కార్యకలాపాలు జరగక దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు కుంటుపడతాయని ఆయన పేర్కొన్నారు. మూల ధన వ్యయంపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇవ్వక పోగా ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు కూడా బడ్జెట్‌లో పొందుపరిచారని మండిపడ్డారు. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, భూసార పరీక్షలు బడ్జెట్ కేటాయింపులు అంకెల్లో ఘనంగా ఉన్నా క్షేత్రస్ధాయిలో రైతులకు నిరాశ ఎదురవుతుందని తెలిపారు. మధ్య చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు ఒక అంకెల గారడీ అని ఎద్దేవా చేశారు.

విద్యా రంగానికి కేంద్రం సహకారం..

మరోవైపు విద్యా రంగానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఇస్తున్న సహకారం మాత్రమే కనపడుతోందని సోము వీర్రాజు అన్నారు. అయితే బడ్జెట్‌లో రాష్ట్రం చేస్తున్నట్లుగా ఎలా చూపించుకుంటారని ఆయన నిలదీశారు. ఇళ్లు నిర్మాణానికి సంబంధించి ఆర్థిక మంత్రి అంతా రాష్ట్రం చేస్తున్నట్లు చెప్పుకోవడం చూస్తే జాలేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లు సకాలంలో నిర్మాణం చేయకుండా అబద్దాలతో ఇళ్లు కడుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై సోము వీర్రాజు విరుచుకుపడ్డారు.


Next Story

Most Viewed