ఏపీలో సామాన్యులు వేరే ప్రాంతానికి వెళ్లాలంటే వీసాలు తీసుకెళ్లాలా?: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

by Disha Web Desk 21 |
ఏపీలో సామాన్యులు వేరే ప్రాంతానికి వెళ్లాలంటే వీసాలు తీసుకెళ్లాలా?: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసిన లేఖపై విచారణ చేయిస్తారుగానీ పుంగనూరులో బీసీలపై జరిగిన దాడులపై విచారణ చేయరని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు,లోకేశ్‌లను చూస్తే భయపడే జగన్.. ఇప్పుడు పసుపు చొక్కా చూసినా భయపడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో సామాన్య ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడుతున్నారు అని చెప్పుకొచ్చారు. వీసాలు తీసుకెళ్లాలనే విధంగా పరిస్థితి ఉందని మండిపడ్డారు. మొన్న పుంగనూరులో జరిగిన సంఘటనను బట్టి ఈ విషయం నిర్ధారణ అవుతోందన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఒక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు సైకిల్ యాత్రగా వెళ్తుంటే పుంగనూరులో పుంగనూరులో వారికి అవమానం జరిగింది అని మండిపడ్డారు. బట్టలూడదీసి కొట్టారు. ఈ ఏరియాకు రావటానికి మీరెవరని చెప్పి దాడి చేశారు. అసలు ఎటు వెళ్తోంది ఈ రాష్ట్రం?. పోలీసు వ్యవస్త నిర్వీర్యమైంది. పుంగనూరును ఏమైనా రిజర్వ్ జోన్ లో పెట్టారా? పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా? అనుమతులు తీసుకొని రావాలా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఈ వైసీపీ నాయకులకు బీసీలంటే ఎందుకంత చులకనా? పుంగనూరులో బీసీలపై జరిగిన దాడి విషయంలో డీజీపీ ఇంతవరకు స్పందించలేదు అని మండిపడ్డారు. పుంగనూరులో నడిరోడ్డుమీద బట్టలూడదీసి కొట్టారు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వర్గాలు వస్తే చేసిన అవమానం అంతా ఇంతా కాదు.ఈ సంఘటన పట్ల డీజీపీ బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాసిన లేఖపై నిమిషాల్లో విచారణ చేసి చట్టరీత్యా శిక్షిస్తారంటున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను చూస్తే భయపడే జగన్ ఇప్పుడు పసుపు రంగు చూసినా భయపడుతున్నాడు అని మండిపడ్డారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.

ఏం చేశారని బస్సు యాత్రలు

రాష్ట్రానికి ఏం చేశారని వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్రలు చేస్తున్నారు అని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల శవాలపై మీరు బస్సు యాత్ర చేస్తారా? అని నిలదీశారు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు అని మండిపడ్డారు. వేలాదిమందిపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లల్లో పెట్టించారు. తోట చంద్రయ్యను నడిరోడ్డుపై కోడిని కోసినట్లు పీక కోశారు. రాయలసీమలో బీసీ సోదరులను అవమానపరుస్తున్నారు అని మండిపడ్డారు. ఏ రకంగా సామాజిక న్యాయం చేస్తారు? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటారు వారికి ఇంతవరకు ఏం చేశారు? అని మండిపడ్డారు. వారి బతుకులు రోడ్డుపాలయ్యాయన్నారు. ఏ రంగంలో చూసినా మీ సామాజిక వర్గంవారే ఉన్నారు. వాళ్ల పదవుల కోసం దళితుల జీవితాలను మీ కాళ్ల కింద పెట్టాల్సి వస్తోంది. గతంలో వైసీపీ చేసిన బస్స యాత్రల్లో జనాలు లేక, రికార్డు డ్యాన్సులు పెట్టుకొని జనాన్ని రప్పించుకున్నారు అని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి?

బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి?అని కొల్లు రవీంద్ర అడిగారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ‘ఎస్సీ సోదరులకు చెందిన అసైన్డ్ భూములు లాక్కున్నారు. బీసీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు బలవంతంగా మీ అధికారులను పెట్టి లాక్కున్నారు. వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని కోట్లు గడిస్తున్నారు. పేదలకు భూములు లేకుండా చేసి సామాజిక న్యాయమంటారా? లక్షా 14 వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోపిడీ చేశారు. బ్యాంకుల నుండి రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఏ కుటుంబం అభివృద్ధి లోకి వచ్చిందో చెప్పాలి. టీడీపీ హయాంలో అంబేద్కర్ భవన్ బీసీ భవన్, ఎస్సీ భవన్ లు కట్టాం. వాటన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది వైసీపీ బస్సు యాత్రను ప్రజలు అడ్డగిస్తారు. ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరముంది. అందరి మంచి కోరే, అందరి బాగు కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలి’ అని ప్రజలకు మాజీమంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed