వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ లేడు: Y. S. Sharmila

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-24 14:08:10  IST  )

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ లేడు: Y. S. Sharmila
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి ప్రభుత్వ తీరు. తిరుమల పవిత్రతపై వైసీపీ చేసిన పాపాన్ని, మహానేత వైఎస్‌ఆర్‌కు చుట్టడం చంద్రబాబుకి భావ్యం కాదు. వైసీపీ కల్తీ పనులు నాటి వైఎస్ఆర్ నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదు. అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్‌పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలి. వైఎస్ఆర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడూ అనుకోలేదు. జరిగిందంతా తప్పుడు ప్రచారమే. అప్పటి ప్రతిపక్ష నేతగా బురద చల్లాలని చూసిందే మీరు. తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు వైఎస్ఆరే. 7 కొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత జీవో ఇచ్చి చరిత్ర సృష్టించారు.

వైఎస్ఆర్ కఠిన నిబంధనలు అమలు

హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు అమలు చేశారు. జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారు. తిరుమల లడ్డూ పవిత్రతకు రక్షణగా నిలబడ్డారు. లడ్డూకు పేటెంట్ రైట్ సాధించింది 2009లో నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే. వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారు. తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పెట్టారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం కట్టారు. వేద పండిట్ ల కోసం ఆనాడే వైఎస్ఆర్ ఆయుష్మాన్ భవ స్కీమ్ అమలు చేశారు. దళితులకు గోవిందుడు దగ్గరవ్వాలని అమలు చేసిన “దళిత గోవిందం” ఆనాడు మహానేత తీసుకున్న గొప్ప నిర్ణయం.

రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి

రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈ నాటికి వైఎస్ఆర్‌ని దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం. వైసీపీ చేసిన అరాచకాలకు వైఎస్ఆర్‌కు సంబంధం లేదు. వైఎస్ఆర్ పాలన సంక్షేమ పాలన. వైసీపీ పాలన దోచుకు తిన్న పాలన. వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ లేడు. రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి. కడవరకు కాంగ్రెస్ లోనే బతికిన మనిషి’ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Next Story