దళితులను చంపి సెటిట్మెంట్లా? మోజెస్‌కు రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలి: వర్ల రామయ్య

by Disha Web Desk 21 |
దళితులను చంపి సెటిట్మెంట్లా? మోజెస్‌కు రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలి: వర్ల రామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎర్రగొండపాలెం సీఐ, ఎస్ఐల కబంద హస్తాల్లో చిక్కుకొని చనిపోయిన మోజెస్ కు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం దళితుల శవాలతో బేరసారాలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల శవాలను పక్కన పెట్టుకొని బేరసారాలు, సెటిల్ మెంట్‌లు చేస్తున్న కొందరు మంత్రులు చనిపోయిన వ్యక్తి బ్రతికున్నా అంతకంటే ఎక్కువ సంపాదించలేడని చెప్పడం చాలా ఘోరమైన విషయమన్నారు. జగన్ పాలనలో దళితుల శవాలకు ధర కట్టడం.. ఇదెక్కడి న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో మోజెస్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పిన ఎస్ఐ, సీఐలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం మాదిగ యువకుడు మోజేస్ మరణం వెనుక దాగి ఉన్న నిజాన్ని ప్రభుత్వం నిగ్గుతేల్చాలి అని డిమాండ్ చేశారు. అతని మరణంలో నిజా నిజాలు తేలాలంటే వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలి అని కోరారు. పోలీసులు, వైసీపీ నాయకులు దళితులను చంపుతుంటారు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సెటిల్ మెంట్ లు చేస్తుంటారు.. ఇలావుంది రాష్ట్ర దుస్థితి, దళితుల పరిస్థితి.నా దళితులు అని చెప్పుకునే జగన్ మోజెస్ మృతిపై నేటికీ ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. దళితులపై ప్రేమ కేవలం మాటల్లోనేనా? ఆచరణలో మాత్రం శూన్యం. ముఖ్యమంత్రి దళితుల మరణాల పట్ల ఏరోజు కూడా ఒక్క సమీక్ష చేయలేదు. ఇప్పటికైనా దళితుల దాడులపై సమీక్షించాల్సిన అవసరముంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ని బర్తరఫ్ చేయాలి

మోజెస్ శవానికి ధర కట్టిన మంత్రి ఆదిమూలపు సురేశ్‌ని బర్తరఫ్ చేయాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పోలీసులు, వైసీపీ నాయకులు దళితులను చంపడం... జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సెటిల్ మెంట్ లు చేయడం ఆనవాయితీగా మారింది అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 185 మంది దళితులను పొట్టన పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం. జగన్ మానసికంగా దళిత వ్యతిరేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో దళితులపై దాడుల్లో ఏపీ 10వ స్థానంలో ఉండడం దౌర్భాగ్యం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయని మోజెస్ పోలీసుల వల్లే చనిపోయాడు, వారే కారణం బాధ్యత ప్రభుత్వానిదే. కనుక 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

Next Story