కోడి కత్తి కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలి.. సావిత్రమ్మ దీక్ష భగ్నం

by Disha Web Desk 3 |
కోడి కత్తి కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలి.. సావిత్రమ్మ దీక్ష భగ్నం
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై జరిగిన కోడికత్తి దాడి కేసులో నిందితుడుగా ఉన్నారు శ్రీను అనే వ్యక్తి. అయితే తన కొడుకు ఏ తప్పుచేయలేదని.. అతను నిర్దోషి అని అంటోంది నిందితుడి తల్లి.. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి.. తన కొడుకుకు న్యాయం చెయ్యాలని కోరుతూ మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్‌ లోని రామా ఫంక్షన్‌హాలులో నిరాహార దీక్ష చేస్తోంది. కాగా ఆమె చేస్తున్న దీక్షను నిన్న రాత్రి పోలీసులు బలవంతంగా భగ్నం చేసారు. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల నడుమ శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజుతో పాటు కుటుంబసభ్యులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో శిబిరం దగ్గరకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు.. సావిత్రమ్మను దీక్ష విరమించాల్సిందిగా కోరారు. కాగా తన కొడుకు నిర్దోషి అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్షం చెబితేనే తాను దీక్ష విరమిస్తానని తేల్చిచెప్పారు సావిత్రమ్మ. ఈ క్రమంలో శనివారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో శిబిరం దగ్గరకు చేరుకున్నారు పోలీసులు.

అనంతరం దీక్ష చేస్తున్న వారిని అక్కడ నుండి పంపించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రయత్నాలను సమతా సైనిక్‌దళ్‌ సభ్యులు, ఇతర మద్దతుదారులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. అనంతరం తీవ్ర ఉద్రిక్తతల నడుమ దీక్ష చేస్తున్న వారిని బలవంతంగా అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యతిరేకంగా సమతా సైనిక్‌దళ్‌ నాయకులు నినాదాలు చేశారు. అలానే ఓ కార్యకర్త జగన్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పెట్రోల్‌ పోసుకుని ఆత్మాహుతికి యత్నించగా అడ్డుకున్న పోలీసులు ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.



Next Story

Most Viewed