గంటల వ్యవధిలోనే యూ టర్న్.. ఎగ్జిట్ పోల్స్‌ ట్రెండ్స్‌పై మాట మార్చిన సజ్జల..!

by Satheesh |   (  Updated:2024-06-02 11:52:09  IST  )

ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్‌పై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎగ్జిట్ పోల్స్

గంటల వ్యవధిలోనే యూ టర్న్.. ఎగ్జిట్ పోల్స్‌ ట్రెండ్స్‌పై మాట మార్చిన సజ్జల..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్‌పై వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎగ్జిట్ పోల్స్ విడుదలైన వెంటనే స్పందించిన సజ్జల.. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. పాజిటివ్ అజెండా ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, దీంతో భారీ స్థాయిలో మహిళలు మరోసారి వైసీపీని ఆదరించారన్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సజ్జల మాట మార్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని అన్నారు. లోకల్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, జాతీయ సంస్థల సర్వేలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు.

టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉండటం వల్లే ఆ ప్రభాకం కనిపించిందని, బీజేపీ 400 సీట్ల టార్గెట్‌కు అనుగుణంగా నేషనల్ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్‌లో అడ్డదిడ్డంగా అంకెలు ఇచ్చారని మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు చేయాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఆరా మస్తాన్ సర్వే 150 సీట్లు వస్తాయని ఏమీ చెప్పలేదని, కానీ ఆరా మస్తాన్ సంస్థ అంచనాల కంటే ఎక్కువే సీట్లే వైసీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసే టీడీపీ సంబరాలు చేసుకుంటుందని.. అవి కేవలం అంచనాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. అయితే, ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ కీలక నేత సజ్జల గంటల వ్యవధిలోనే మాట మార్చడం ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Next Story