మండుటెండల్లో కూల్ న్యూస్.. రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాల ఆగమనం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-14 12:44:53  IST  )

మండువేసవిలో రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.

మండుటెండల్లో కూల్ న్యూస్.. రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాల ఆగమనం
X

దిశ, వెబ్‌డెస్క్: మండుటెండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్న వేళ.. వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఎల్లుండి నాటికి అంటే.. మే 16వ తేదీకి నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం నైరుతి రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా.. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వివరించింది. దీని ప్రభావంతో శుక్రవారం (రేపు) అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో రైతులు పొలాల్లో ఉండొద్దని, పశువుల కాపరులు సైతం చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు APSDMA వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం రాష్ట్రంలో 43-44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గంగవరం, కూనవరం, రంపచోడవరం, కోనసీమ జిల్లా ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, గోకవరం, కోరుకొండ, కొవ్వూరు, రాజమండ్రి, అర్బన్ అండ్ రూరల్, రాజానంగరం, సీతానగరం, తాళ్లపూడి, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, అనంతపురం జిల్లా అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Next Story