Re Sound in YCP: భయపడుతున్న జగన్.. ప్లాన్‌లో మార్పులు..!

by Disha Web Desk 16 |
Re Sound in YCP: భయపడుతున్న జగన్..  ప్లాన్‌లో మార్పులు..!
X
  • తలనొప్పిగా మారిన పార్టీలో అసమ్మతి
  • కుదుపుకుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం
  • దూకుడు పెంచుతున్న ప్రతిపక్షం
  • అప్పుల కోసం ఢిల్లీలో తిష్టవేయాల్సిన పరిస్థితి
  • అధిష్టానం చెవుల్లో ముందస్తుకి వెళ్లాలని సూచనలు

దిశ, డైనమిక్ బ్యూరో: వై నాట్ 175 అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని ..ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు. అన్ని సర్వేలు అనుకూలంగానే ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అయితే ధీమా ఉండొచ్చు గానీ మరీ ఇంత ఉండొద్దంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు వైసీపీ గ్రాఫ్‌ పడిపోవడానికి కూడా చాలా కారణాలు అంటున్నారు. ఇప్పటి వరకు సర్వేలలో వైసీపీకి 51శాతం ఓట్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పడంతో వైసీపీ అదే ధీమాగా ఉంది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. రోజోకో వివాదంలో వైసీపీ ఇరుక్కుంటుంది. మరోవైపు సొంత పార్టీలో అసమ్మతి సెగలు రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తోంది. మరోవైపు అప్పులు వేధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి కొందరు ముందస్తు ఎన్నికల అంశాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే మంచిదని పలువురు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీపై ఎందుకు ఒత్తిడి పెంచుతుందో ఓ సారి చూద్దాం.

వైనాట్ 175

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మొదటి మూడున్నరేళ్లు వైసీపీ నాన్ స్టాప్‌గా దూసుకెళ్లింది. ఎక్కడా కూడా కనీసం స్పీడ్ బ్రేకర్స్ కూడా అడ్డు తగల్లేదు. ఎన్నోసార్లు ఫ్యాన్ స్పీడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించినప్పటికీ బెడిసికొట్టాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి ఖాయం అంటూ కూడా సర్వేలు వెల్లడించాయి. మరోవైపు ప్రతీ ఆరు నెలలకోసారి వైసీపీ నాయకత్వం నిర్వహించే సర్వేలలో కూడా వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. దీంతో ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైనాట్ 175 అనే నినాదం ఇచ్చారు. చంద్రబాబు కంచుకోట అయిన కుప్పం కోట దగ్గర నుంచి మెుదలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయ దుందుభి మోగించాల్సిందేనని చెప్పుకొస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ.. బహిరంగ వేదికలపై నుంచి.. నియోజకవర్గాల సమీక్షలలోనూ వై నాట్ 175 అంటూ సీఎం జగన్ పదే పదే పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.

కొంపముంచుతున్న తిరుగుబాటు, అసమ్మతి

నిన్న మొన్నటి వరకు వైసీపీ చాలా ధీమాగా ఉంది. 175 నియోజకవర్గాల్లో గెలుపొందుతామని గంటాపథంగా చెప్పుకొచ్చింది. ముందస్తు అంశంపై ప్రశ్నిస్తే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఐదేళ్లు పాలిస్తామని వైసీపీ చెప్పుకొచ్చింది. ముందస్తుకు వెళ్లాల్సిన తొందరేముందని చెప్పుకొచ్చింది. ప్రజల్లో తమకు విపరీతమైన ఆదరణ ఉందని ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ స్వీప్ చేసి తీరుతామని చెప్పుకొచ్చింది. అయితే ఈ ధీమా రోజురోజుకు సన్నగిల్లుతుంది. ఒకవైపు వైసీపీలో తిరుగుబాటు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. మరికొందరు సైతం సమయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ తిరుగుబాటు సంగతి అటు ఉంచితే అసమ్మతి మరింత తలనొప్పిగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు ఎంపీకి పొసగడండ లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు నియోజకవర్గ పరిశీలకులకు పడటం లేదు. ఉదాహరణకు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నియోజకవర్గ పరిశీలకుడికి మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణాలు వైసీపీని పుట్టిముంచే ప్రమాదం ఉందని పార్టీ నాయకులు మదనపడుతున్నారు.

ప్రతిపక్షాల దూకుడు

ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు సైతం చాలా దూకుడు పెంచాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో టీడీపీలో నూతనొత్తేజం మొదలైంది. అంతేకాదు ఇటీవలే నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను సైతం టీడీపీ నియమించింది. దీంతో వారంతా చాలా యాక్టివ్ అయ్యారు. ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు లేకపోలేదు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం దూకుడు పెంచాలని నిర్ణయించారు. త్వరలోనే వారాహి యాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారాహి వాహనానికి ఇప్పటికే ప్రత్యేక పూజలు సైతం చేశారు. ఇదిలా ఉంటే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అంటూ దూసుకెళ్లిపోతుంటే టీడీపీ, జనసేన పార్టీలు సైతం అంతే దూకుడుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ముందుస్తుకు వెళ్తే బెటర్

రాష్ట్రంలో వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఇటీవలే పార్టీ హైకమాండ్ చర్చించినట్లు తెలుస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ లోలోపల మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడనీయడం లేదని తెలుస్తోంది. ఒకవైపు మూడు రాజధానులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి దుస్థితి. మరోవైపు అసమ్మతి, తిరుగుబాటులను నియంత్రించడంలో విఫలం. ఇదే పరిస్థితి భవిష్యత్‌లో మరింత ఉండొచ్చని వార్తల నేపథ్యంలో వైసీపీ ఆందోళన చెందుతోంది. మరోవైపు రోజుకో వివాదంలో వైసీపీ ఇరుక్కుంటుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ అంశం వైసీపీని విపక్షాలు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఇదిలా ఉంటే అప్పులు మరింత సమస్యగా మారింది. 4 వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అప్పుల కోసం ఢిల్లీలో రోజుల కొద్దీ పడిగాపులు కాయాల్సిన దయనీయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరో 14 నెలలపాటు అటు జీతాలు, ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చాలా కష్టతరంగా మారుతుంది. ఇది కాస్త ప్రతిపక్షం అవకాశంగా మలచుకుంటే వారికి అస్త్రాన్ని చేతికందించినట్లే అవుతుంది. ఇలాంటి తరుణంలో ముందస్తుకు వెళ్తే ఈ అంశాలన్నింటికి ముకుతాడు వేయోచ్చని పార్టీలోని కొందరు పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఒకసారి ఆలోచించండి అని అధిష్టానం చెవుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ముందస్తుపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


Next Story