నంద్యాల ఎంపీ వినతిపై రైల్వేశాఖ స్పందన

by Thanuru Gopichand |

డిసెంబర్ 10న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Shabari) నంద్యాల రైల్వే సేవల విషయమై పార్లమెంటులో గళం విప్పారు.

నంద్యాల ఎంపీ వినతిపై రైల్వేశాఖ స్పందన
X

దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్ 10న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Shabari) నంద్యాల రైల్వే సేవల విషయమై పార్లమెంటులో గళం విప్పారు. రైల్వే సేవలను మెరుగుపరచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను పార్లమెంట్ వేదికగా కోరారు. ఈ క్రమంలో ఆమె వినతిపై కేంద్ర రైల్వే శాఖ (Indian Railways) స్పందించింది. నంద్యాల మీదుగా గుంతకల్లు-మార్కాపురం రోజువారీ ప్యాసింజర్ రైలు నడిపే ప్రతిపాదన తమ వద్ద ఉన్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. దీంతో నంద్యాల నుంచి రైలు ప్రయాణం చేసేవారిలో హర్షం వ్యక్తమవుతోంది.

అయితే గతంలో ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంటులో మాట్లాడుతూ.. నంద్యాల నుంచి గుంతకల్లుకు పగటి పూట రైళ్లు నడపాలని, వయా బేతంచెర్ల మీదుగా ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌ను కలుపుతూ కర్నూలు(దుపాడు) వరకు కొత్త రైలు మార్గం వేయాలని కోరారు. నంద్యాల నుంచి గుంతకల్లు వైపు నాలుగు రైళ్లు ఉన్నాయని అన్నారు. ఆ నాలుగు రైళ్లు చాలా వరకు రాత్రి సమయాల్లో నడుస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని రైళ్లు అర్ధరాత్రి 12:55, 1:30, 2:20, రాత్రి 8:20కి ఒక రైలు ఉందన్నారు. దీంతో రోజువారీగా వెళ్లే రైలు ప్రయాణికులు, విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి దయచేసి ఈ మార్గానికి చాలా ఉపయోగకరంగా ఉండే రోజువారీ పగటిపూట మెమో రైలు లేదా ప్రయాణికుల రైలును న‌డిపించాల‌ని అభ్యర్థిస్తున్నానని పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్‌ను ఎంపీ కోరారు.

కేంద్ర రైల్వేశాఖ మంత్రి సమాధానం ఇస్తూ.. గుంతకల్లులో ఐసీఎఫ్ కోచ్‌ల (ICF COACH) కోసం కొంత నిర్వహణ సౌకర్యం ఉందని, నంద్యాలలో నిర్వహణ సౌకర్యం లేదన్నారు. సమస్యను పరిష్కరించే మార్గాన్ని కనుగొనమని తాను రైల్వే నిపుణులు బృందాన్ని కోరానని సభకు వివరించారు. తాను ఫీల్డ్ అధికారులతో కూడా త్వరలో వివరంగా చర్చిస్తానన్నారు. వీలైనంత త్వరలో పరిష్కారం కనుగొనబడిన వెంటనే, ఎంపీకి తెలియజేస్తానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు తమ స్పందనను తెలియజేశారు.

Next Story