- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి విజయవాడ నగరంలో నిషేధాజ్ఞలు అమలు
శాంతి, భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు.

దిశ, వెబ్ డెస్క్ : నేటి నుంచి విజయవాడ (Vijayawada) నగరంలో నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు పోలీసు కమిషనర్ వి.రాజశేఖర బాబు (Commissioner V Raja Shekara Babu) కీలక ఉత్తర్వులను జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా జీవనానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. 1861 పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలను విధించామన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 09 వరకు మూడు నెలల పాటు నిషేధం అమలులో ఉంటుందన్నారు. కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మూడు నెలల కాలంలో నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ నిషేధాజ్ఞల నేపథ్యంలో పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా నగరంలో ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని కమిషనర్ రాజశేఖర బాబు పేర్కొన్నారు. అలాగే నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు కూడా అనుమతి లేదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా కమీషనర్ కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రజల రక్షణ, నగర ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. నిబంధనలను పాటించి శాంతిభద్రతల కాపాడటంలో భాగస్వాములు కావాలని తన ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.






