అలా చేస్తే..నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తా: బాలినేని

by Disha Web Desk 16 |
అలా చేస్తే..నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తా: బాలినేని
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు ఉన్నాయంటూ జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తనతోపాటు తన వియ్యంకుడు భాస్కరరెడ్డికి కూడా పెట్టుబడులు ఉన్నాయంటూ ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు. సినీ పరిశ్రమలో తానూ, తన వియ్యకుండు రూపాయి కూడా పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. తాను రూపాయి పెట్టుబడి పెట్టునట్లు నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని సవాల్ విసిరారు.

అంతేకాదు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని. తనపై ఆరోపణలు చేసిన జనసేన నేత ఇందుకు సిద్ధమా అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ చేశారు. ఇకనైనా దుష్ప్రచారాలు మానుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరా తీసుకోవచ్చని బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

కాగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కరరెడ్డి, వైసీపీ నేత, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పెట్టుబడులు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయనకు సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Next Story