ఎన్టీఆర్‌ను మించిపోతారనే రంగా హత్య.. పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఎన్టీఆర్‌ను మించిపోతారనే రంగా హత్య.. పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడు వంగవీటి రంగా ఉంటే కచ్చితంగా సీఎం అయ్యేవారని సినీ నటుడు, వైసీపీ నేత పోసాని మురళి అన్నారు. టీడీపీ-జనసేన పొత్తులపై ఆయన మరోసారి స్పందించారు. వంగవీటి రంగాను చంపింది చంద్రబాబేనని అందరికీ తెలుసన్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ కంటే రంగా గొప్పవారని.. అందుకే ఆయన్ను టార్గెట్ చేశారని తెలిపారు. రంగా కారులో చిన్న కర్ర దొరికినా.. ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేవారని గుర్తు చేశారు. తనను చంపుతారని రంగాకు అర్ధమైపోయిందని.. తనకు ప్రాణహాని ఉందని నాటి ప్రధాని రాజీవ్‌కు ఆయన లేఖ రాశారని పోసాని తెలిపారు.


అయితే ఎన్టీఆర్‌ను రంగా మించిపోతున్నారనే ఆయనను హత్య చేయించారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కాపుల్లో కీలకమైన వ్యక్తులు ఎవరూ రాజకీయ పార్టీ పెట్టలేదని.. ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చాడని పోసాని పేర్కొన్నారు. ప్రజలు తనకు అండగా ఉంటే తాను ముఖ్యమంత్రి అవుతానని పవన్ చెప్పాడని పోసాని గుర్తు చేశారు. దీంతో రంగాలా ఉంటారని కాపులు భావించారని, కానీ చంద్రబాబు కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. తాను సీఎం కాలేనని.. చంద్రబాబుకు మాత్రమే ఆ అర్హత ఉందని పవన్ చెబుతున్నాడని పోసాని ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు కాపులు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ముద్రగడను చంద్రబాబు ఎంత వేధించారో ప్రజలందరికీ తెలుసన్నారు. ముద్రగడను వేధించినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కాపులను తిట్టిన చంద్రబాబుతో పవన్ ఎందుకు తిరుగుతున్నారని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.

Next Story