వీరసింహారెడ్డి ఫ్లెక్సీపై వైసీపీ ఎమ్మెల్యే ఫోటో

by Dishafeatures2 |
వీరసింహారెడ్డి ఫ్లెక్సీపై వైసీపీ ఎమ్మెల్యే ఫోటో
X

దిశ, డైనమిక్ బ్యూరో : నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా మలినేని గోపీచంద్ తెరకెక్కించిన వీరసింహారెడ్డి మూవీ థియేటర్లలో వీర విహారం చేస్తోంది. అంతేకాదు సినిమాలోని డైలాగులు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించేలా ఉన్నాయంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఫోటోతో బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్‌లు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరసింహారెడ్డి మూవీ విడుదల సందర్భంగా మైలవరం వైసీపీ ఏమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కూడిన బాలకృష్ణ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవి ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీశాయి.

ఇప్పటికే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్నారని పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అంతేకాదు టీడీపీలో చేరతారంటూ మరికొందరు ఏకంగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం తాను వైసీపీలోనే ఉంటానని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.



Next Story

Most Viewed