పొత్తు గురించి విమర్శలు చేయొద్దు.. జనసైనికులకు Naga Babu వార్నింగ్

by Dishafeatures2 |
పొత్తు గురించి విమర్శలు చేయొద్దు.. జనసైనికులకు Naga Babu వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన పొత్తు గురించి సోషల్ మీడియాలో కొంతమంది జనసేన శ్రేణులు విమర్శలు కురిపిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీకే లాభం జరుగుతుందని, జనసేనకు ఎలాంటి మేలు జరగదని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇలాంటి పోస్ట్‌లు పెట్టేవారికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. పొత్తు గురించి పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా విమర్శలు చేయవద్దని సూచించారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, గీత దాటినవారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీతో పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నాగబాబు స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానున్న వారాహి విజయ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం జనసేన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీతో పొత్తుకు నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. టీడీపీతో పొత్తును ప్రజలు ఆమోదించారని, త్వరలోనే టీడీపీతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని మనోహర్ స్పష్టం చేశారు.

కాగా జనసేనతో భాగస్వామం చేసుకునేందుకు ఇప్పటికే టీడీపీ కూడా కొంతమంది నేతలతో ఒక కమిటీని ప్రకటించింది. ఇక జనసేన కూడా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఈ రెండు కమిటీలు త్వరలోనే సమావేశం కానున్నాయి. కలిసి కార్యక్రమాలు నిర్వహించడంపై చర్చించి ప్రణాళికలు రూపొందించనున్నారు.

ఇవి కూడా చదవండి : కైకలూరులో కాకరేపుతున్న మాజీమంత్రి: పొత్తు ఉంటే BJP లేకపోతే Jana Sena నుంచి సై

Next Story