పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు : మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 21 |
పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు : మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భూ యజమానిగా ఇండోసోల్ కంపెనీ నిలిచిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీ నాయకులు 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి అన్న సంతర్పణగా చేశారని చేసిన ఆరోపణలనుఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఖండించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌వి అసత్య ఆరోపణలు అని అభివర్ణించారు. పరిశ్రమలశాఖలో అభివృద్ధిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ ముందు పరిశ్రమల శాఖపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు వెన్నుపోటు వారసత్వంగా వచ్చింది అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే పవన్‌కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే నాదెండ్ల చిన్న కట్టప్ప అని అభివర్ణించారు. నాదెండ్ల మనోహర్‌కు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అలవాటుగా మారిందని.. అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ 1

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్‌ కో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో తలసరి ఆదాయంలో ఏపీ 17వ స్థానంలో ఉంటే.. నేడు సీఎం వైఎస్ జగన్ పాలనలో 9వ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వ్యవసాయ రంగంలో ఏపీ 6వ స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు పాలనలో రాష్ట్రం 27వ స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. 13 లక్షల మందికి ఎంఎస్‌ఎంఈ ద్వారా ఉపాధి కల్పించామని, పారిశ్రామిక రంగంలో ఏపీకి 3వ స్థానం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో జీఎస్‌డీపీలో 22వ స్థానంలో ఉంటే.. నేడు నంబర్‌ వన్‌ స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. జీఎస్‌డీపీ ర్యాంక్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నామని...10 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నామని, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను నిర్మిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed