ఇండియా పేరు మార్పుపై మంత్రి ఆర్‌కే రోజా రియాక్షన్

by Disha Web Desk 21 |
ఇండియా పేరు మార్పుపై మంత్రి ఆర్‌కే రోజా రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇండియా పేరును మారుస్తున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జీ-20దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఇన్విటేషన్ కార్డులపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడంతో ఇక ఇండియా పేరు భారత్‌గా మారుస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇండియా పేరును భారత్‌గా మార్చడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు స్వాగతిస్తున్నారు. ఇంకొందరు అయితే మౌనం వహిస్తున్నారు. ఇక ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి భారత్‌గా పేరు మార్చడాన్ని స్వాగతిస్తున్నారు.ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా ఇండియా పేరు మార్పుపై తనదైన శైలిలో స్పందించారు. ఇండియా పేరును భారత్‌గా మారిస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. బుధవారం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రి ఆర్‌కే రోజా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె ఇండియా పేరు మార్పుపై మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్‌లో ఇండియా అని పిలవడం కంటే మన భాషలో భారత్ అని పిలవడం అత్యంత అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్, భారతదేశం అనే పదాలు చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటుగా మారాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇండియా పేరును భారత్‌గా మారిస్తే తాను స్వాగతిస్తానని మంత్రి ఆర్‌కే రోజా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.

పేరు మార్పుపై వడివడిగా అడుగులు

ఇండియా పేరును భారత్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఈ నెలలో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇండియా పేరు మార్పు అనేది ఇప్పటి ప్రక్రియ కాదని గత కొన్ని నెలలుగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది ప్రధాని మోడీ ఆగస్టు 22- 24 వరకు 15వ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన ఈ బ్రిక్స్ సమావేశానికి సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాసి ఉంది. ఇండోనేషియాలో కూడా ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఆసియన్- ఇండియా సమ్మిట్, ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లలో మోడీ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్లలో కూడా మోడీని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈసమావేశాల అనంతరం దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డులపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. దీంతో ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

More News : రోజా ఎవరో నాకు తెలియదు’.. కంగన షాకింగ్ కామెంట్స్

Next Story