‘రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఊరుకోం’.. మంత్రి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-11 09:29:31  IST  )

ఏపీలో మద్యం కుంభకోణం కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.

‘రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఊరుకోం’.. మంత్రి పయ్యావుల స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మద్యం కుంభకోణం కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం) అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శల పేరుతో రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో.. వైసీపీ శ్రేణులు మామిడి పండ్లను రోడ్డు పై పారేసి ట్రాక్టర్‌తో తొక్కించడం దారుణం అన్నారు. ఇది వారి ఫొటోషూట్ డ్రామా అని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచి మాట్లాడటం సరికాదన్నారు.

ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను కూటమి హాయాంలో గాడిలో పెడుతున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. బుగ్గన బుర్ర కథలు ఆపాలని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రుణాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల విమర్శించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా దొంగ మెయిల్స్ పంపారని ఆరోపించారు. పెట్టుబడిదారులను తప్పుడు మెయిల్స్ తో అడ్డుకునే యత్నం చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పయ్యావుల హెచ్చరించారు. యువతకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో తప్పుడు మెయిల్స్ పెట్టి లేఖలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story