తిరుమల ప్రతిష్టకు భంగం.. ఆవేదనతో రిపోర్టు బయటపెట్టిన చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-05 14:55:35  IST  )

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ చెప్పారు....

తిరుమల ప్రతిష్టకు భంగం.. ఆవేదనతో రిపోర్టు బయటపెట్టిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం(Tirumala laddoo adulteration case)లో ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే కొన్ని అంశాలను బయటపెడుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్‌(Minister Payyavula Keshav) చెప్పారు. సీఎం నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. గతంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదని, సువాసన రావడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. నెయ్యి నూనెలా జారిపోతోందని పోటు కార్మికులు చెబితే అప్పట్లో పాలకులు అది ఆర్గానిక్‌ నెయ్యి అని వారికి అబద్దాలు చెప్పారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి ఈవో శ్యామలరావు నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను ఎన్‌డీడీబీకి పంపడం జరిగిందన్నారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి కేశవ్‌ తెలిపారు. నెయ్యి కల్తీ జరిగిందని ఆ నివేదిక తేల్చింది. సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఫిష్‌ ఆయిల్, కోకోనట్‌ ఆయిల్, పామాయిల్, వెజిటబుల్‌ ఆయిల్‌తోపాటు జంతుకొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టం చేసిందని మంత్రి పయ్యావుల చెప్పారు.

ఆవేదనతోనే...


తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆవేదనతో సీఎం ఎన్‌డీడీబీ నివేదికను శాసనసభ పక్ష సమావేశంలో బయటపెట్టారని మంత్రి వివరించారు. గత పాలకులకు తెలిసే నెయ్యి కల్తీ ఘటన జరిగిందని, అయినా గత ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టిందన్నారు. 2022లో సీఎఫ్‌ఆర్‌టీఐ నివేదికలో కల్తీ నెయ్యి అంశం వెలుగులోకి వచ్చింది. అయినా గత పాలకులు దాన్ని 2024 వరకూ కొనసాగించారని చెప్పారు. నెయ్యి అని పిలుస్తున్న పదార్థం బోలేబాబా డెయిరీలో తయారు చేశారని, నెయ్యిలా మార్చేందుకు రకరకాల కెమికల్స్‌ కలిపారని, కొన్నింటిని కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారని మంత్రి పయ్యావుల అన్నారు. అయితే ఈ విషయాల్లో సిట్‌ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోయారో తెలియాలన్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యులైన వారంతా నేరస్థులే, మూల సూత్రధారులేనని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు.

Next Story