జాతీయ రహదారులకు మహర్దశ.. మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

కృష్ణా జిల్లాలో జాతీయ రహదారులను పోర్టు, పరిశ్రమలు, పర్యాటకానికి అనుసంధానం చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ...

జాతీయ రహదారులకు మహర్దశ.. మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని పోర్టు, పరిశ్రమలు, పర్యాటకానికి అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. NHAI & MoRTH (Ministry of Road transport and Highways) ప్రతినిధులతో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సుమారు రూ.35 వేల కోట్ల వ్యయంతో జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు ప్రతిపాదనలున్నాయని, మచిలీపట్నం-విజయవాడ రోడ్డును రూ.1900 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్-మచిలీపట్నం రోడ్డు విజయవాడ మీదుగా వస్తున్న సమయంలో ఎదురవుతున్న సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపారు.

ఆరు వరుసలుగా నేషనల్ హైవే 65 విస్తరణ

నేషనల్ హైవే 65ను ఆరు వరుసలుగా విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, ఆ మార్గంలో నిర్మించాల్సిన అండర్ పాస్‌లు, డ్రైనేజీలపై స్థానిక ప్రజాప్రతినిధుల నుండి ప్రతిపాదనలు స్వీకరించామని చెప్పారు. పామర్రు-గుడివాడ ఎన్‌హెచ్ 65ను ఎన్‌హెచ్ 216కు అనుసంధానించడం గురించి చర్చించామని, అదే సమయంలో అమరావతి ఔటర్ రింగు రోడ్డు 189కి.మీల మేర ప్రతిపాదించారని. కృష్ణా జిల్లాలో ఉయ్యూరు- వల్లూరు మీదుగా గుడివాడ వరకు వెళ్తోంది. ఆ ప్రాంతంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర చెప్పారు.

డీపీఆర్ రెడీ



‘నేషనల్ హైవే 216ను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు కూడా డీపీఆర్ సిద్ధమైంది. అదే సమయంలో సముద్రతీరం వెంబడి రోడ్డు అనుసంధానించాలని ప్రతిపాదించారు. బందరు పోర్టు నిర్మాణ పనులు కొలిక్కి వస్తున్నాయి. పోర్టుకు, పోర్టు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. మంగినపూడి బీచ్ నుండి కృత్తివెన్ను బీచ్ వరకు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం. బీచ్‌లను రోడ్డుకు అనుసంధానించేందుకు లోసరి బ్రిడ్జి నుండి కోడూరు ఉల్లిపాలెం బ్రిడ్జి వరకు ఉన్న 70 కి.మీలను కూడా పూర్తి చేయాలి. తద్వారా తీర ప్రాంత ప్రజలకు రవాణా సదుపాయాలు సులభతరం చేసే అవకాశం ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తైతే.. తుపాన్ల సమయంలో రక్షణగా కూడా నిలిచే అవకాశం ఉంటుంది. ’’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

రైతుల అభిప్రాయాల మేరకే భూసేకరణ

నేషనల్ హైవే 216 విస్తరణకు అవసరమైన భూసేకరణకు రైతుల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ వరకు ఆ రోడ్డును విస్తరించాలని, అవసరమైన చోట ఫ్లై ఓవర్లకు ప్రతిపాదించారని, చిలకలపూడి, బందరుకోట, కరఅగ్రహారం మెడికల్ కాలేజీ, పోతేపల్లి వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలు కూడా మంజూరైనట్లు తెలిపారు. మచిలీపట్నం పోర్టును అమరావతికి అనుసంధానించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అభివృద్ధికి కేరాఫ్‌గా కృష్ణా జిల్లా

‘‘ఉమ్మడి కృష్ణా జిల్లాను అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిపేందుకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా అడుగేస్తున్నాం. అవసరమైన అభివృద్ధి ప్రతిపాదనలతో త్వరలోనే ముఖ్యమంత్రిని కూడా కలుస్తాం. ప్రస్తుతం మంజూరైన రోడ్డు విస్తరణ పనుల టెండర్ ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేస్తాం. జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక అవసరాలకు అనుగుణంగా రోడ్డు మార్గాన్ని తీర్చిదిద్దుకుంటాం. మంగినపూడి నుండి కృత్తివెన్ను వరకు ఉన్న బ్యాక్ వాటర్‌ను కూడా అభివృద్ధి చేసి పర్యాటకం, ఆక్వా రంగాలను అభివృద్ధి చేస్తాం.’’ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Next Story