పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

by Ramesh Naini |

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ పరామర్శించారు.

పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను సోమవారం మహారాష్ట్ర సీఎందేవేంద్ర ఫడ్నవిస్ పరామర్శించారు. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న పవన్‌ను ఆయన స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఫడ్నవిస్‌కు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఆ సమయంలో వారి వెంట ఉన్నారు.

శస్త్రచికిత్స వివరాలు..

కాగా, పవన్‌ కల్యాణ్ కుడి భుజానికి స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు డాక్టర్‌ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని బృందం గత శనివారం దాదాపు మూడున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించింది. రొటేటర్‌ కఫ్‌ గాయం, అవల్షన్‌ ఫ్రాక్చర్‌ ఉండటంతో ఈ ఆపరేషన్ అత్యవసరమైంది. ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స జరిగిన సమయంలోనే వైద్యులు భుజం గాయాల తీవ్రతను గుర్తించి ఆపరేషన్ సూచించారు. మరికొన్ని రోజుల తర్వాత ఆయన ఎడమ భుజానికీ సర్జరీ చేయనున్నారు.

పదేళ్లుగా వేధిస్తున్న నొప్పి..

దాదాపు పదేళ్ల క్రితం (2016లో) పవన్ భుజాలకు గాయాలయ్యాయి. అయితే తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం, పోరాట యాత్ర, వారాహి యాత్రలతో పాటు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో అభిమానుల తాకిడికి ఆ గాయాలు మరింత తీవ్రమయ్యాయని జనసేన కార్యాలయం వెల్లడించింది. పదేళ్లుగా నొప్పి భరిస్తూనే ఆయన తన రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Next Story